Monday, April 29, 2024

AP: కారుతో ఢీకొట్టి.. కానిస్టేబుల్ ను చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు..

ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగించారు. కారుతో ఢీకొట్టి కానిస్టేబుల్ ను చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్రచందనం దొంగిలిస్తూ అడ్డుకోబోయిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌ను అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారు. అనంతరం పారిపోయేందుకు యత్నించారు. అయితే పట్టువదలకుండా స్మగ్లర్ల వెంట పోలీసులు వెంటపడ్డారు. దీంతో కారును వదిలి ముగ్గురు పారిపోయారు. మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ తెల్లవారుజామున కేవీపల్లి మండలం హుందేవారిపల్లి వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అయితే ఓ కారులో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కారును ఆపి చెకింగ్ చేసేందుకు కానిస్టేబుల్ గణేశ్‌తో పాటు మిగిలిన పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే కారును ఆపలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు కారును వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు కారును ఆపకుండా కానిస్టేబుల్ గణేశ్‌ను ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గణేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. కానిస్టేబుల్ మృతితో పోలీసులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement