Monday, April 29, 2024

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారు శ్రీశుభకృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దేశ విదేశాలలో ఉండే తెలుగు ప్రజలకు నూతన శ్రీశుభకృత్‌నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. శ్రీవారి అనుగ్రహంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడి దేశ వ్యాప్తంగా సాధారణ స్థితులు నెలకొంటున్నాయని చెప్పారు. రాబోవు రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు లేకుండా లోకంలోని మానవాళిని కాపాడాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు రాములు, మారుతి ప్రసాద్‌, కృష్ణారావు, నందకుమార్‌, జేఇవోలు సదాభార్గవి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఫల పుష్ప ఆకృతులు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తాయి, సపోట, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభి న్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత శ్రీలంక ఆర్టుతో చేసిన అలంకరణలు, పుచ్చకాలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవ ధాన్యాలతో చేసిన శ్రీమహావిష్ణువు, శ్రీరాముడి సెట్టింగులు భక్తులను ఆకర్షించాయి. అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత, ద్వాపరయుగాలకు సంబంధించిన వివిధ సన్నివేశాల సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం వెలుపల భక్తులు తమ సెల్‌ఫోన్‌లతో ఫల పుష్ప ఆకృతులతో ఫొటోలు తీసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. టీటీడీ గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు మూడు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయలమైన ఫల-పుష్ప ఆకృతులను రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement