పెనమలూరు, ప్రభ న్యూస్ : కృష్ణా నదిలో సరదాగా ఈతకోసం వెళ్లిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన అయిదుగురు విద్యార్థుల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన షేక్ బాజీ(13), దూదేకుల హుస్సేన్ (14), మద్దాల బాలు(15)లు మృతి చెందారు. తోటా కామేష్14), ఈనకొల్లు గుణశేఖర్ (14) గల్లంతయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. నదీ తీరంలో విద్యార్ధుల మృతదేహాలను చూపరులను కంటతడిపెట్టిస్తున్నాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు, బంధువులు రోదనతో కృష్ణా తీరం మిన్నంటింది .
ఉన్నత చదువులు చదివి కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సిన విద్యార్ధులు ఆ కుటుంబాల్లో తీరని గర్భశోకాన్ని మిగిల్చారు. సరదాగా ఈతకని వెళ్లిన ఐదుగురు విద్యార్ధులు కృష్ణా నదిలో మునిగి మృత్యువాతకు గురైన సం ఘటన స్దానికంగా తీవ్ర కలవరానికి గురిచేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పడమటలో నివసిస్తున్న ఐదుగురు విద్యార్ధులు శుక్రవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా యనమలకుదురు గ్రామ పరిధిలో ఈతకు వెళ్లారు. ముందుగా ఒక వి ద్యార్ధి నీటి గుంతలో చిక్కుకున్నాడు. సహచర మిత్రులు రక్షించే ప్రయత్నంలో వారు కూడా నీటమునిగిపోయారు. సంఘటన చూసిన గొర్రెల కాపరులు రక్షించేందుకు ప్రయత్నించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు ప్రారంభించారు. సాయంత్రానికి ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇద్దరు విద్యార్ధుల కోసం గాలిస్తున్నారు.