Friday, May 3, 2024

బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త

న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వ‌ద్ద ఇవాళ ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా హిందూపురంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయ‌న ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయల్దేర‌డంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమీ లేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు… బాలకృష్ణ ఇంటి వద్దే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి ముట్టడికి బయలుదేరారు.

రెండు పార్టీల నేతలు బాలయ్య ఇంటికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకోవ‌డంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిన‌ట్లైంది. హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో డంపింగ్ యార్డు తరలింపు తప్ప మరో అభివృద్ధి పనిచేయలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ చంద్రమౌళీ విమర్శించడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement