Monday, April 29, 2024

ప్రజలకు చేరువ అయ్యేందుకు టీడీపీ వ్యూహాలు.. టీడీపీ వెబ్‌ రేడియో ఏర్పాటుకు సన్నాహాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికార పీఠంపై కన్నేసిన తెలుగుదేశం పార్టీ, దాన్ని దక్కించుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది. రోజుకొక వినూత్న అంశంతో ప్రజలకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని, తన పదునైన వ్యూహాలను ఒక్కొక్కటిగా అమలుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా సాంకేతికత వినియోగంలో దిట్టగా పేరుగాంచిన చంద్రబాబు, దాని సహాయంతోనే ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినియోగిస్తున్న సాంకేతికతలో మరిన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ సోషల్‌ మీడియా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి రాష్ట్రస్థాయిలో ఇంఛార్జ్‌లను నియమించడమే కాకుండా ప్రతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ సోషల్‌ మీడియాను వినియోగించుకోవడం తప్పనిసరిగా వినియోగించేలా ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరగడం, ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు ఉంటున్న పరిస్థితులను టీడీపీ తనకు అనువుగా మలుచుకుంది. పార్టీ కార్యక్రమాలన్నీ లైవ్‌లో సెల్‌ఫోన్లలో వీక్షించే దిశగా ఏర్పాట్లు చేసింది. ఇంకోవైపు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ యాప్‌లను విరివిగా వినియోగించుకుంటూ పార్టీ శ్రేణులకు కార్యక్రమాలను చేరువ చేసింది. అయితే ఇవన్నీ సాధారణ ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరడం లేదని భావించిన చంద్రబాబు, ఇప్పుడు మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్‌కీబాత్‌ తరహాలో తన సందేశాలు, పార్టీ ముఖ్య నేతల ప్రసంగాలను ప్రజలకు రేడియో ద్వారా చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకమైన వెబ్‌ రేడియోను డిజైన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్న ఆయన దాన్ని సాధ్యమైనంత త్వరలో రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్‌ఎం రేడియో తరహాలో టీడీపీ వాయిస్‌ రేడియోను తీసుకురావాలని యోచించినా ఆ తర్వాత వివిధ సాంకేతిక కారణాలు, సిగ్నల్‌ లోపాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని పక్కు పెట్టారు.

- Advertisement -

అయితే తాజాగా వెబ్‌ రేడియో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు దాని డిజైనింగ్‌పై దృష్టి సారించారు. పార్టీకి సంబంధించిన నేతలు సాంకేతిక నిపుణులతో చర్చలు సాగిస్తున్నారు. దీనికోసం కావాల్సిన ఫ్రీక్వెన్సీ అనుమతులు, ఇతర అంశాలను పార్టీ సాంకేతిక విభాగం పరిశీలిస్తోంది. వెబ్‌ రేడియో ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలను ప్రజల మదిలో నిలిచిపోయేలా వాటికి సంబంధించిన వీడియోలను అస్త్రాల రూపంలో సంధించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ అస్త్రాలను కూడా తెదేపా సిద్ధం చేస్తోంది. నియోజకవర్గాలు, మండలాలు, పట్టణాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఈ వీడియోల ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంకోవైపు వెబ్‌ రేడియోను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఘటన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం ఇదే సమయంలో చంద్రబాబు, నేతల స్పందన, జరుగుతున్న పరిణామాలు ఈ రేడియో కార్యక్రమాల ద్వారా వివరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement