Thursday, May 2, 2024

చిరు వ్యాపారుల బ‌తుకులు చింద‌ర‌వంద‌ర‌…

అమరావతి, : రాష్ట్రంలో విపత్తులు సంభవించిన ప్రతిసారి చిరువ్యాపా రులు నష్ట పోతూనే ఉంటారు. ప్రకృతి కన్నెర్ర చేసినా.. అకాల వర్షాల రూపంలో భారీ వరద లొచ్చినా.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా రోడ్డు మార్జిన్‌ వ్యాపారులే విలవిల్లాడిపోతుం టారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ధాటికి రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారు లతో పాటు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే చిన్న వ్యాపారులంతా చితికి పోతున్నారు. గడిచిన నెలరోజులుగా వ్యాపారా లు జరగక గతంలో వ్యాపారాభివృద్దికి తెచ్చిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక సతమతమవు తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాతో లక్షలాది మంది చిరువ్యాపారుల జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి. కొన్ని కుటుంబాలైతే నిలువునా చితికిపోతున్నాయి. మరికొంతమందికైతే పూటగడవడం కూడా కష్ట ంగా మారింది. రాష్ట్రంలో మార్చి చివరి వారం నుంచి కరోనా విలయ తాండవం చేస్తోంది. మే 5వ తేదీ నుంచి ప్రభుత్వం పగటి కర్ఫ్యూను విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆ కొద్దిసమయం చిరువ్యాపారులకు అనుకూల సమయం కాకపోవడంతో కొంతమంది వ్యాపారులకు కనీసం రోజూవారీ కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో రోడ్డు మార్జిన్‌ వ్యాపారు లతో పాటు తోడుపుబండ్లపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంది. సగటున ఒక్కో జిల్లాలో 10 నుంచి 25 వేల మందికి పైగా చిరువ్యాపారులు ఉన్నారు. వీరంతా నిత్యం తమ వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వారి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గడిచిన నెల రోజులుగా చేతిలో చిల్లిగవ్వలేక విలవిల్లాడిపోతున్నారు. ఆదు కునే చేతుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
నెల రోజులుగా సాగని వ్యాపారాలు
సాధారణ రోజుల్లో చిరువ్యాపారులు ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు రోడ్డు మార్జిన్‌లో, ప్రధాన కూడళ్లలో, తోపుడుబండ్లపై వీధుల్లో వివిధ రకాల వ్యాపారాలను చేసుకుంటూ జీవనం సాగిస్తారు. అందుకు కుటుంబంలోని మిగిలిన సభ్యుల సహాయ సహకారా లు కూడా పూర్తి సమయం కేటాయిస్తుంటారు. దీంతో ఒక్కో వ్యాపారి సగటున ఖర్చులన్నీ పోను రోజుకు వెయ్యి నుంచి రూ. 2 వేలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకునేవాడు. ఉదాహరణకు రోడ్డు మార్జిన్‌లో తొ
పుడుబండిపై టిఫిన్‌ సెంటర్‌ను నిర్వహించే వ్యాపారులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ రకాల ఆహార పదార్థాలను విక్రయిస్తారు. హోటళ్లతో పోలిస్తే ధర తక్కువగా ఉంటుంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రోడ్డు మార్జిన్‌ టిఫిన్‌ సెంటర్లకే వస్తుంటారు. దీంతో సాధారణ రోజుల్లో వారికి ఆదాయం కూడా పుష్కలంగా ఉండేది. అయితే కరోనా పుణ్యమా అని గడిచిన నెలరోజులుగా వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. కరోనాతో చాలామంది ఇళ్ల వద్దే టిఫిన్లు తినేస్తున్నారు. దీనికి తోడు ఈ నెల 5వ తేదీ నుంచి పగటి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దీంతో ఆ కొద్ది సమయంలో వారి వ్యాపారాలు ముందుకు సాగడం లేదు. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. దీంతో కొంతమంది టిఫిన్‌ సెంటర్లు పెట్టడం కూడా మానేశారు. అదేవిధంగా అనేక రకాల వ్యాపారులు పెట్టుబడులు పెడితే మధ్యాహ్నం 12 లోపు వాటిని విక్రయించుకోలేక నష్టపోతున్నారు.
పూలు దిగుబడి ఉన్నా.. కొనేవారేరీ
రాష్ట్రంలో పూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక సీజన్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఏడాది పొడవునా అన్నీరకాల పూల విక్రయాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఫ్ల వర్‌ స్టాల్స్‌ రద్దీగా ఉంటాయి. అయితే కరోనా నేపథ్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిలిపివేయడం, పెళ్లిళ్లు, శుభకార్యాలకు పరిమిత సంఖ్యలోనే హాజరు కావాలని నిబంధనలు పెట్టారు. దీంతో కొంతమంది వివాహాలను కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సాయంత్రం పూట కర్ఫ్యూ నేపథ్యంలో చిరువ్యాపారులు రోడ్లపైకి వచ్చి తమ కార్యకలాపాలు చేసుకునే అవకాశం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష నుంచి 2 లక్షల మందికి పైగా పూల వ్యాపారులు విలవిల్లాడిపోతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో మల్లెపూల వ్యాపారం బాగా సాగుతోంది. ప్రత్యేకించి ఏప్రిల్‌, మే, జూన్‌, జులై నెలల్లోనే మల్లెపూలకు సీజన్‌. రాష్ట్రవ్యాప్తంగా కడప, నెల్లూరు, కర్నూలు, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో మల్లెను అత్యధికంగా సాగు చేస్తుం టారు. అయితే పూలు అమ్ముకునేందుకు అవకాశం లేక చెట్లకు విరబూస్తున్న పూలను కోస్తే కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోతుండడంతో అనేకమంది రైతులు పూలు కోయకుండానే వదిలేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement