Thursday, May 2, 2024

AP: శ్రీసిటీని సందర్శించిన స్టాన్ ఫోర్డ్ వర్సిటీ బృందం

సత్యవేడు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : అమెరికా కు చెందిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్ త్ ఈ ఎం) విభాగానికి చెందిన 20మంది అధ్యాపకులు, విద్యార్థుల, ప్రతినిధుల బృందం ఈరోజు శ్రీసిటీని సందర్శించారు. ప్రొఫెసర్ మైకెల్ కోచెండర్‌ఫర్, పీహెచ్‌డీ స్కాలర్ డైలాన్ మిచెల్ అస్మార్ నేతృత్వంలో విచ్చేసిన బృందానికి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ చైర్మన్ సి.శ్రీని రాజు వర్చువల్ మోడ్‌లో వీరితో మాట్లాడుతూ… “వర్క్, లివ్, లెర్న్, ప్లే” సూత్రం ఆధారంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశ్రామిక అనుకూల వాతావరణంలో శ్రీసిటీ ప్రగతి సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్‌డిజి) అనుగుణంగా సౌర విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ తదితర వివిధ సుస్థిరత కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పారిశ్రామిక విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడడంపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ పారిశ్రామికవాడగా శ్రీసిటీ అవతరించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు.

శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఇతర ప్రత్యేకతల గురించి సతీష్ కామత్ వివరించారు. పెప్సికో, క్యాడ్‌బరీస్, కోల్‌గేట్ పామోలివ్, VRV-చార్ట్ ఇండస్ట్రీస్, బాల్ కార్పొరేషన్, కెల్లాగ్స్, వెస్ట్ ఫార్మా సహా పదకొండు ప్రముఖ అమెరికన్ కంపెనీలతో పాటు ప్రపంచంలోని 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీ ప్రాజెక్ట్ ఖచ్చితమైన ప్రణాళిక, అమలు, ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాల పట్ల స్టాన్‌ఫోర్డ్ బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ మోడల్, ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిరత కార్యక్రమాలను నేరుగా వీక్షించి అర్థం చేసుకోవడమే తమ పర్యటన ఉద్దేశంగా వారు తెలిపారు. శ్రీసిటీ గురించి వీరు లేవనెత్తిన పలు ప్రశ్నలు, సందేహాలను శ్రీని రాజు, సతీష్ కామత్ తమ వివరణలతో నివృత్తి చేశారు.

- Advertisement -


చర్చల అనంతరం, ప్రతినిధుల బృందం శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూశారు. ఐ ఎఫ్ ఎఫ్, వెస్ట్ ఫార్మా పరిశ్రమలను సందర్శించి, అక్కడ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. అక్కడ నుంచి క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులతో సంభాషించారు. క్రియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిర్మలరావు అతిథులకు స్వాగతం పలికి, స్టాన్‌ఫోర్డ్, క్రియా విద్యార్థులతో ప్రత్యేక పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. క్రియా అడ్మిషన్ విధానం, కోర్సు సమాచారం, శ్రీసిటీ పారిశ్రామిక, వ్యాపార వాతావరణంలో చదువుకోవడం వల్ల కలిగే విశిష్ట ప్రయోజనాలు, స్టూడెంట్ క్లబ్‌లు మొదలైన పలు అంశాల గురించి స్టాన్‌ఫోర్డ్ విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోగా, స్టాన్‌ఫోర్డ్ కోర్సులు, వాటి కంటెంట్ గురించి క్రియా విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement