తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, మాడవీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్తో కలసి శుక్రవారం తిరుమల అన్నమయ్య భ వనంలో అన్ని విభాగాల అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత అనుభవానలు దృష్టిలో ఉంచుకుని జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను వౖౖెభవంగా నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వాజా రోహణం జరగనున్నదని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. అక్టోబర్ 1 న గరుడ వాహనం, అక్టోబర్ 2 న స్వర్ణరథం, అక్టోబర్ 4 న రథోత్సవం, అక్టోబర్ 5 న చక్రస్నానం జరుగుతాయని తెలియజేశారు. కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహన సేవలు ఏకాంతంగా నిర్వహించామని, ఈ సారి మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్దులు, వి కలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. ఈసారి గరుడ సేవ పెరటాసి మాసంలో మూడో శనివారం రోజున జరగనుందని, భక్తులు విశేషంగా విచ్చేసే అవకాశముండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడతామని వివరించారు.
సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకు బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లోనూ పరిశుభ్రంగా ఉంచుతామని ఈవో తెలిపారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రుయా, స్మిమ్స్ ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను రప్పించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత కల్పిస్తామని , ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తగినన్ని ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తామని, గరుడ సేవనాడు భ క్తుల ద్విచక్ర వాహనాలను తిరుపతిలోనే పార్కు చేసి బస్సులో తిరుమలకు చేరుకోవాలని కోరారు. గరుడ సేవ జరిగే రోజుతో పాటు ఆ ముందు రోజు, తరువాతి రోజు ఆన్లైన్లో గదుల కేటాయింపు ఉండదని, మిగిలిన రోజులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో కేటాయిస్తామని, మిగిలినవి కరెంటుబుకింగ్లో భక్తులకు కేటాయిస్తామని చెప్పారు. భక్తులందరికి అన్నప్రసాదాలు అందిస్తామని, మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిల్ నిషేదం అమలులో ఉన్నందున భక్తులు తమతో పాటు గాజు, లేదా రాగి లేదా స్టీల్ బాటిళ్ళు వెంట తెచ్చుకోవాలని కోరారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంజనీరింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలోని భవనాలు, చెట్ల పై విద్యుత్ అలంకరణలు చేప డతామన్నారు. గరుడ సేవనాడు భక్తులు ఎ త్తౖౖెన భవనాలు ఎక్కకుండా తగిన జాగ్రత్తులు తీసుకోవాలన్నారు. వాహన సేవలను ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, అదనపు ఎస్వి మునిరామయ్య, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్రెడ్డి, ట్రాన్స్ పోర్టు జిఎం శేషారెడ్డి, డిప్యూటిఈవోలు రమేష్బాబు, హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.