Sunday, May 19, 2024

AP: స్కూళ్ల‌పై సచివాలయాల పెత్తనం.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

విద్యాశాఖలో విపరీత ధోరణులకు ఏపీ ప్రభుత్వం తెరతీస్తోంది. తాజాగా పాఠశాలలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి పెత్తనం అప్పగించాలని నిర్ణయించింది. పాఠశాలలను వారానికి ఒకసారి తనిఖీ చేసే అధికారాలను గ్రామ, వార్డు సచి వాలయాల సిబ్బందికి అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచే సింది. పాఠశాలల పర్యవేక్షణకు మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారి పోస్టులు భర్తీచేయకుండా పాఠశాలల తనిఖీ అధికారాలను సచివాయాల సిబ్బందికి అప్పగించడాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.

ఇక‌.. సచివాలయాల పరిధిలోని పాఠశాలల్లో సంబంధిత ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసులకు తనిఖీ అధికారాలను కట్టబెట్టారు. తనిఖీ వివరాలను స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ( ఎస్ఓపీ ) ప్రకారం సంబంధిత యాప్ వివరాలను ఫొటోలతో అప్‌లోడ్‌ చేయాలి. వారం వారం తప్పకుండా వీరు పాఠశాలలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరెవరు ఏమి తనిఖీ చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వార్డు ఎడ్యుకేటర్ అసిస్టెంట్ / వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరి పాఠశాలలో విద్యార్థుల నమోదు, హాజరు పరిశీలించాలి.

ఎక్కువ రోజులు పాఠశాలలకు గైర్హాజరయ్యే విద్యార్థులపై ఫోకస్ పెట్టి వారు తిరిగి హాజరయ్యేలా చూడాలి. నాడు- నేడు పథకం కింద పాఠశాలలకు కల్పించిన వసతులు, వాటి నాణ్యత, వినియోగిస్తున్న సామగ్రిని పరిశీలించాలి. మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించడంతో పాటు విద్యార్థులకు జేవీకే కిట్లు పంపిణీ చేశారా లేదా ఇస్తే విద్యార్థులు వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలించాలి. పాఠశాలల భద్రత, విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టి తనిఖీలు నిర్వహించి ప్రత్యేక యాప్ లో వివరాలన్నింటిని నమోదు చేయాలి.

మహిళా పోలీసులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కనీసం నెలకు ఒకసారి తనిఖీ చేయాలి. వీరు పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, ప్రమాణాలు, దిశ మొబైల్ అప్లికేషన్, బాల్య వివాహాలను నిరోధించడం, పోక్సో చట్టం తదితర వాటి వివరాలను తనిఖీ చేసి యాప్లో వివరాలు నమోదు చేయాలి. పాఠశాలలు తనిఖీ అధికారాలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించడంపై టీచర్లలో వ్యతిరేక వ్యక్తం అవుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement