Sunday, April 28, 2024

లే-అవుట్ల వద్దకే ఇసుక.. వేగవంతంగా నిర్మాణాలు జరిగేలా పర్యవేక్షణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు’ పథకంలో భాగంగా మొదటి దశలో ప్రారంభమైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఉన్నత న్యాయస్థానం నుంచి క్లియరెన్స్‌ రావడంతో దాదాపు రెండు నెలల జాప్యం తర్వాత తిరిగి పనులు మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను లే-అవుట్ల వద్దకే సరఫరా చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా లబ్ధిదారులపై రవాణా భారం పడకుండా చూడటంతోపాటు, ఇసుక కొరతను నివారించవచ్చని భావిస్తోంది. ఇప్పటికే గృహ నిర్మాణాల లే-అవుట్ల వద్ద గోడౌన్లను నిర్మిస్తున్నారు. సిమెంట్‌, స్టీల్‌, ఐరన్‌ తదితర వస్తువులను నిల్వ ఉంచేందుకు ఈ గోడౌన్లను సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఇసుకను కూడా ఆయా లే-అవుట్ల వద్దకు సరఫరా చేస్తే పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయ డంతో పాటు, లే-అవుట్ల‌లో మౌలిక సదుపాయాలను పూర్తి చేయటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశించారు. నిర్మాణ సామగ్రిని లే ఔట్లవద్దే భద్రపరిచే విధంగా గోడౌన్లను ఏర్పాటు చేయాలని, జిల్లాలలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి సంస్థకు చెందిన ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపు నిచ్చారు. నిర్మాణాలలో లభిదారులకు ఏవిధమై న ఇబ్బందులు ఎదురుకాకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయటానికి కృషి చేయాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement