Sunday, April 28, 2024

శ్రీశైలంలో మారుమోగిన శివనామ స్మరణ.. మొదలైన బ్రహ్మోత్సవాలు

కర్నూలు, ప్రభా న్యూస్ బ్యూరో: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్రంలో శివనామ స్మరణలు మిన్నంటుతున్నాయి. మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేద పండితులు, ఆలయ అధికారులు అంకురార్పణ చేయగా.. నవాహ్నిక దీక్షతో11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం  ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి.ఉత్సవ నిర్వహణలో భాగంగా తొలిరోజు యాగశాల ప్రవేశం కార్యక్రమం మొదలైంది. ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు , అర్చకులు , వేదపండితులు , అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు .  ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.

ప్రత్యేకంగా ఆకట్టుకున్న ధ్వజారోహణ : బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం నిర్వహించిన ధ్వజారోహణ ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది.. నందిధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలు నిర్వహించారు . కార్యక్రమములోనే భేరీపూజ కూడా నిర్వహించడం విశేషం. భేరీపూజలో డోలు వాద్యానికి పూజాదికాలు జరిపారు . తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో ఆయాదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం విశేషం . చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశా రు . ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలకు , యక్ష , గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట . ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి , రోజూ పద్ధతి ప్రకారంగా వారికి నివేదన సమర్పిస్తారు . బ్రహ్మోత్సవ సమయములో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి .

bhra
Advertisement

తాజా వార్తలు

Advertisement