Sunday, April 28, 2024

ఏపీలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి 95 శాతం ప్రజలు

వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది.

డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ: వైద్య సేవల రంగంలో విప్లవాత్మక అడుగులకు శ్రీకారం చుడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో “డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ” పథకం ద్వారా క్యాన్సర్ తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తృతపరిచేందుకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలలోని 130కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను కూడా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వైద్యం ఖర్చు రూ.1,000 దాటిన అన్ని చికిత్సలకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టింది. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన రూ. 680 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు, జూన్ 2019 నుండి ఇప్పటివరకు చెల్లించాల్సిన మరో రూ.2,398 కోట్ల బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు రెండు చెవులకూ కాక్లియర్ పరికరం అమర్చి సేవలందిస్తోంది.

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా: ఆరోగ్యశ్రీ లో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డా.వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000ల వరకు, డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులూ రోగులకు చెల్లించడం జరుగుతోంది.

ఆసుపత్రులలో నాడునేడు: ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు వీలుగా నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు పెద్దఎత్తున చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం, 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి ఆసుపత్రిలో అవసరమైనంత మంది సిబ్బంది ఉండేలా 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకం చేపట్టడం జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ చొప్పున కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు, కొత్తగా మూడు క్యాన్సర్, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఐటీడీఏల పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరిగింది. దశలవారీగా మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో WHO/GMP ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

108, 104 సేవలు: ఆపత్కాలంలో రోగులకు అత్యసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.210 కోట్లతో 104 మరియు 108 సర్వీసుల విభాగంలో కొత్తగా 1,088 అత్యంత అధునాతన సంచార వైద్యశాలలు, అంబులెన్స్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేయడమే గాక ఇకపై  ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే చేరుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది. 104 సేవల్లో భాగంగా వైద్య సిబ్బంది పల్లెలకు వెళ్లి 20 రకాల వైద్య సేవలు, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వెళ్లి ఉచితసేవలు అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విశిష్ట సేవలు అందిస్తున్న 104, 108 సిబ్బంది.  108 మరియు 104 సర్వీసుల ఉద్యోగుల కష్టాలను గమనించిన ప్రభుత్వం 108 సర్వీసుల డ్రైవర్ల వేతనాన్ని రూ.13,000 నుండి రూ. 28,000 లకు పెంచింది. 104 సర్వీసులలో పనిచేసే ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల జీతాలు కూడా రూ.17,500 నుండి రూ.20,000, డ్రైవర్ల జీతం రూ.26,000 లకు పెంచడమే కాకుండా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా నెలవారీ వేతనం రూ.8,000 నుండి రూ.16,000లకు పెంచడం జరిగింది.

- Advertisement -

వైఎస్సార్ కంటి వెలుగు: “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్న మాటలను అక్షర సత్యం చేస్తూ నివారింపదగిన అంధత్వాన్ని 1 శాతం నుండి 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు, 65 సంవత్సరాలు పైబడిన అవ్వాతాతలకు రూ. 560 కోట్ల వ్యయంతో “వైఎస్సార్ కంటి వెలుగు” పథకం క్రింద కంటి వైద్య సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రెండున్నర సంవత్సరాల కాలంలో మొత్తం ఆరు దశల్లో జరుగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 2019 అక్టోబర్ 10 నుండి 16 వ తేదీ వరకు 66 లక్షల మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు 60,000 సుశిక్షితులైన సిబ్బందితో పాఠశాలల వద్దే ఉచిత కంటి పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. రెండవ దశలో కంటి పరీక్ష నిపుణులతో కూడిన 500 టీమ్స్ తో 4.36 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 1.5 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరిగింది. క్లిష్టమైన కంటి సమస్యలున్న 46,000 విద్యార్థులలో అవసరమైన వారందరికీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడో దశలో 2020 ఫిబ్రవరి 18 నుండి జూలై 31 వరకు 56,88,428 మంది అవ్వా తాతలకు గ్రామ సచివాలయాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహించి గ్రామ/వార్డు వాలంటీర్లచే ఇంటివద్దనే ఉచిత కంటి అద్దాలు అందజేయడం జరిగింది.

వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.2,250, లెప్రసీ వ్యాధిగ్రస్తులకు రూ.3,000, బోధకాలు, పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణతతో వీల్ చెయిర్ లేదా మంచానికే పరిమితమైన వారికి, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, మూత్రపిండాలు, కాలేయం, గుండెమార్పిడి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 5,000, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10,000 పెన్షన్ అందిస్తున్నారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,410 కాల్ సెంటర్ ద్వారా టెలీమెడిసిన్ సేవలు అందిస్తోంది. ప్రతి జిల్లాకు ఒక టెలీమెడిసిన్ సేవా కేంద్రంతో పాటు ప్రతి కేంద్రంలో 10 నుండి 15 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండి రోగి నుండి జబ్బు వివరాలు తెలుసుకొని మందులు, సూచనలను ఫోన్ ద్వారా అందిస్తారు. టెలీమెడిసిన్ కేంద్రాల ద్వారా ప్రతి రోజు వేలాదిమంది రోగులకు లబ్ది చేకూరుస్తోంది ప్రభుత్వం.

కరోన నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియ: పేదవాడిపై ఆర్థిక భారం పడకుండా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా చికిత్సను డా. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అత్యవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తోంది. కొత్తగా మ్యుకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ (బ్లాక్ ఫంగస్) కు సంబంధించిన చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది ప్రభుత్వం. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసదుపాయాల కల్పనతో పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. కరోనా ఆస్పత్రుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ తగినన్ని పడకలు, మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో రోజుకు దాదాపు లక్ష దాకా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్యకు తగ్గట్టుగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ చేపడుతోంది. కరోనా రహిత సమాజం నిర్మాణం కోసం ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి మొత్తం ఇప్పటివరకు 79,08,945 మందికి వ్యాక్సిన్ అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement