Friday, May 3, 2024

ఆరోగ్యంపై అవగాహన..

యర్రగొండపాలెం : ఆరోగ్యంపై అవగాహన ఉన్న సమాజం ఉన్నత స్థితిలో ఉంటుందని యంఈఓ పి.ఆంజనేయులు పేర్కొన్నారు. మండలంలోని వైపాలెం జడ్‌ పి పాఠశాల, వీరభద్రాపురం మినీ గురుకులంలో పాఠశాల ఆరోగ్యవిద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంఈఓ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ నేడు ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే అనారోగ్యానికి కారణమవుతోందన్నారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థిని, విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఎస్‌ఈసిఆర్‌టి నుండి ఆరోగ్యవిద్యపై వచ్చిన ప్రత్యేకాధికారి సోమశేఖర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత, తీసుకునే జాగ్రత్తలు అంశాలను పరిశీలించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, వ్యర్థపదార్థాల నిల్వ పరిశీలించడం జరిగింది. ప్రత్యేక శిక్షణలో చెప్పబడిన ప్రతీ విషయాన్ని పాఠశాలలో అనుసరించాలని, శిక్షణ ఉపయుక్త వనరులు, బడి పిల్లల ఆరోగ్యం శ్రేయస్సు పుస్తకం గురించి వివరించడం జరిగిందన్నారు. మొత్తం పుస్తకంలో 11 అధ్యాయాలున్నాయని ప్రతీ ఒక్కటీ ఎంతో విలువైందని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యసూత్రాలు నేర్పించాలని, పాఠశాలల్లో లింగసమానత్వం ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించి 100, 1098 నెంబర్లపై, ఇంటర్‌నెట్‌ చూసి మోసపోకుండా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్‌యంలు, ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు టి.కోటేశ్వరరావు, ఎస్‌. దుర్గారావు, విఎల్‌ఎస్‌ మూర్తి, డి.హనుమాన్‌నాయక్‌, ఇ.శ్రీనివాసులు, బి.ఎల్లయ్యలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement