Saturday, May 4, 2024

9నుంచి దశలవారీగా ఉద్యమం.. ఏపీ జేఏసీ

ఈనెల 9వ తేదీ నుంచి దశల వారీగా ఉద్యోగుల ఉదమం ఉంటుందని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు తెలిపారు. ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే అమలు కాకపోవడంతో ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యమానికి సిద్ధమయ్యామని, ఇది ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన అని ఏపీ జేఏసీ నేతలు అన్నారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్‌ లోని రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, ఫణిపేరాజు, ఏపీ జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్, చేబ్రోలు కృష్ణమూర్తి, ఏపీ ఆర్ ఎస్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జీతాభత్యాల కోసం ఎదురుచూస్తూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని అప్పుల వాళ్ల దగ్గర తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కనీసం జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉద్యోగులకు సందిగ్ధం నెలకొందన్నారు. మందుల బిళ్లలు అయిపోయి ప్రతి రోజూ పెన్షన్ డబ్బులు పడ్డాయో, లేదో అని కళ్లలో వత్తులు వేసుకుని విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఏమవుతుంది ? ఎక్కడికి పోతుంది ? ఎందుకు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అరియర్స్, డీఏ బకాయిలు, కొత్త డీఏ, లీవ్ ఎస్ క్యాష్ మెంట్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు.

వీటిపై లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ముందుగా ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమమై కదులుతామని హెచ్చరించారు. ఇది ఉద్యోగుల ఆత్మ గౌరవ ఉద్యమమని స్పష్టం చేశారు. కడుపు నిండి కాదని, కడుపు మండి ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని, ఈ కారణంగా ప్రజలెవరైనా ఇబ్బందులు పడితే.. అది ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఉద్యోగి ఉద్యమ జెండా పట్టుకుని హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వై.కృష్ణ, అసోసియేట్ ఛైర్మన్, నాగ రమణయ్య, కోశాధికారి రామానాయుడు, నాయకులు ఏపీ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, అర్లయ్య, ఓంకార్ యాదవ్, వెంకట్ రెడ్డి, గిడ్డయ్య, సులోచనమ్మ, ఎ.వి.రెడ్డి, రెవెన్యూ, ఏ పి టి డి ఉద్యోగులు, ఇంజినీరింగ్, ఆర్టీసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, క్లాస్ 4 ఎంప్లాయీస్, కోఆపరేటివ్, కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్, వివిధ ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement