Sunday, May 5, 2024

ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో పిటిషన్

కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య నాటు మందుపై ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ అనుమతి కోసం న్యాయవాది బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున న్యాయవాది బాలాజీ పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. విచారణకు అనుమతించాలని  కోరారు.

మరోవైపు ఆనందయ్య మందుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అనందయ్య నాటు మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆనందయ్య నాటు మందుకు ఆయుష్ బృందం పరిశీలించింది. ఆనందయ్య మందలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ స్పష్టం చేసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఈ మందులో ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని చెప్పారు. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామన్నారు. ఇక ఐసీఎంఆర్ కూడా ఆనందయ్య మందను పరిశీలిస్తోంది. మరింత పరిశోధన తర్వాత మందు పంపిణీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఐసీఎంఆర్ ఇచ్చే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement