రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని బైపాస్లోని పార్టీ కార్యకర్తకు చెందిన భవనంలో నేడు ఆయన గృహప్రవేశం చేశారు. అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి, ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని, రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చానని తెలిపారు.