Sunday, April 28, 2024

నారా లోకేష్ పాదయాత్ర ఏర్పాట్ల పై పరిటాల సునీత సమీక్ష

కదిరి – ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్ర మరికొన్ని రోజుల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశిస్తుందని.. ఈ పాదయాత్రను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాదయాత్ర పరిశీలకులు బీద రవిచంద్ర, అమర్నాథ్ రెడ్డితో పాటు సత్యసాయి జిల్లా తెదేపా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. నారా లోకేష్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి వారికి ధైర్యంగా నిలబడటానికి పాదయాత్ర చేస్తున్నారని, వాస్తవంగా ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని కేవలం ప్రజల కోసమే జనంలోకి వస్తున్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని, మరికొన్ని రోజుల్లో కదిరి నియోజకవర్గంలోకి ఈ యాత్ర వస్తుందన్నారు.

ఇప్పటినుంచే ఈ యాత్రకు సన్నద్ధం కావాలని, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ యాత్రలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవాలని నాయకులకు సూచించారు. ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి యువత, మహిళలు, నిరుద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవాలన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement