Sunday, April 28, 2024

Order Order: జ‌గ‌న్ కేసు వాయిదా కుద‌ర‌దు.. అట్ల‌యితే రోజుకు 50వేలు ఇవ్వాల‌న్న హైకోర్టు..

అక్రమాస్తుల కేసు విచారణలో వాయిదా కోరిన సీఎం జగన్ తరపు న్యాయవాదిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోసారి వాయిదా కావాలంటే రోజుకు రూ.50వేలు ఖర్చుల కింద చెల్లించేలా ఆదేశాలు జారీచేస్తామ‌ని ఆగ్ర‌హించింది ధ‌ర్మాస‌నం.
జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై కేసులను కొట్టివేయాల‌ని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జాబితా వారీగా కేసు విచారణకు పిలవగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్‌ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి న్యాయవాది గడువు కోరారు.

అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరు మినహాయింపుపై దాఖలు చేసిన పిటిషన్‌లలో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఒక్క రోజు వాయిదా కావాల‌ని జగన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ కోరారు. దీంతో జగన్ తరపు లాయర్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ కేసులు విచారణకు వచ్చినప్పుడు వాదనలు వినిపించాల్సిందేనని స్పష్టం చేశారు.

వాయిదా కోరితే కోర్టు ఖర్చుల కింద హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు రోజుకు రూ.50 వేల చొప్పున చెల్లించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించారు. అనంతరం వాన్‌పిక్‌ కేసులో ఆరో నిందితుడైన ఐఆర్‌ఏస్‌ మాజీ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కొంత సేపు వాదనల త‌ర్వాత‌ తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు .

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement