Friday, May 17, 2024

వాన జాడే లేదు, వరద ఊసే వద్దు.. అడుగంటుతున్న జలాశయాలు

అమరావతి, ఆంధ్రప్రభ.. రుతు పవనాల జాడ లేదు..జూన్‌ ముగిసి జులై వచ్చేస్తున్నా వాన చినుకుల ఊసు లేదు.. చెరువులు ఎండిపోతున్నాయి..రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటు-తున్నాయి..ఈనెల మొదటి వారం నుంచే కృష్ణా, గోదావరి డెల్టాల కింద కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన ఖరీఫ్‌ సాగు కోసం సమృద్ధిగా నీళ్ళు అవసరం…నాగార్జున సాగర్‌, పెన్నా కింద భూముల్లో వ్యవసాయ సీజన్‌ ప్రారంభించేందుకు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు..వర్షాధారంపై ఆధారపడ్డ ప్రాంతాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో సాధారణ వర్షపాతం కనిష్టస్థాయికి పడిపోయింది. కొన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు 80 శాతానికి పైగా చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 1 నుంచి 25 వరకు సగటు వర్షపాతం కేవలం 32.86 మి.మీగా నమోదయింది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 60 శాతం తక్కువ. శ్రీకాకుళంలో 63 శాతం, విజయనగరంలో 80 శాతం, విశాఖపట్టణంలో 41, తూర్పుగోదావరిలో 64, పశ్చిమ గోదావరిలో 84, కృష్ణాలో 82, గుంటూరులో 86, ప్రకాశంలో 63, నెల్లూరులో 48, చిత్తూరులో 41, కడపలో 36, అనంతపురంలో 4, కర్నూలులో 61 శాతం వర్షపాతం తక్కువగా నమోదయింది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో వాటి పూర్తి స్థాయి సామర్ద్యానికన్నా 52.31 శాతం తక్కువగా కేవలం 469 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం 47.69 శాతం నీటి నిల్వలుండగా రోజురోజుకూ అవి తగ్గిపోతున్నాయి. చిన్న నీటి పారుదల రంగంలోనూ అదే పరిస్థితి కనబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 38,392 చెరువులుండగా వాటి సామర్దంలో 52.39 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్‌ నీటి నిల్వ సామర్దం 586.21 టీఎంసీలు కాగా.. 236.61 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. పెన్నా బేసిన్‌ సామర్దం 238.75 టీఎంసీలు కాగా 106.28 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. శ్రీశైలం రాజర్వాయర్‌ లో 215.81 టీఎంసీలకు గాను కేవలం 43.61 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 312.05 టీఎంసీకు గాను 174.46 టీఎంసీలు, పులిచింతలలో 45.77 టీఎంసీలకు గాను 31.25 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement