Sunday, April 28, 2024

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం.. సకాలంలో వైద్యం అంద‌క వృద్ధురాలి మృతి

మనుబోలు (ప్రభన్యూస్): ప్రాణాలను కాపాడవలసిన డాక్ట‌ర్లు సకాలంలో స్పందించకపోవ‌డం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం పోయింది. వడదెబ్బ తగిలిన ఓ వృద్ధురాలికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో చ‌నిపోయిన ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. నెల్లూరు జనరల్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మ‌నుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కొమరాల నరసమ్మ (86) ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి, తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆదివారం బంధువులు 108 సాయంతో మెరుగైన వైద్య సేవలకోసం నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించారు.

అక్కడ సిబ్బంది సర్జికల్ వార్డులో జాయిన్ చేశారు. డాక్ట‌ర్లు పరీక్షించి వైద్య సాయం చేస్తారని.. చెప్పినారు. రోగి నిరసనంగా బలహీనంగా ఉందని బంధువులు బతిమిలాడితే సిబ్బంది సెలైన్ పెట్టి వ‌దిలేశార‌ని బంధువులు చెబుతున్నారు. అయితే.. ఆదివారం కావడంతో డాక్ట‌ర్లు ఎవరూ అందుబాటులో లేక‌పోవ‌డంతో రాత్రి వస్తారని చెప్పారన్నారు. కానీ, డాక్ట‌ర్లెవ‌రూ రాలేదని వారు తెలిపారు. ఏ వైద్యుడు కనీసం పలకరించిన పాపాన పోలేదని బంధువులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో నరసమ్మ ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురై వైద్యం అందక చనిపోయిందని బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు. సేవలు అందించవలసిన డాక్ట‌ర్లు పత్తా లేకుండా పోవడం వల్లే ఆమె చనిపోయిందని, మరణానికి డాక్ట‌ర్లే బాధ్యత వహించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement