Wednesday, May 15, 2024

AP: ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ పీడీగా నవీన్‌ కుమార్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (ఏపీశాక్స్‌) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా నవీన్‌కుమార్‌ను నియమిస్తూ చీఫ్‌ సెక్రటరీ సమీర్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో 2007 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నవీన్‌కుమార్‌ త్వరలో పీడీగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీకి ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ గా ఐఏఎస్‌ అధికారి ఉండాలి. 2014 రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు ఇన్‌చార్జిలతోనే కాలం గడిపేస్తున్నారు.

గత కొన్నేళ్ళుగా హెల్త్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులే ఈ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఆరునెలల్లో రిటైర్‌ అయిపోయే అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో వాళ్లు పెద్దగా దీన్ని గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గడిచిన ఏడాదిన్నరలో నలుగురు ఇన్‌చార్జులు మారారంటే శాక్స్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై గతనెల్లో ‘ఆంధ్రప్రభ’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారిని శాక్స్‌ పీడీ నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement