Tuesday, April 30, 2024

Telugu Desam – పరిశ్రమలు తీసుకొస్తా.. ఉద్యోగాలు ఇస్తా – నారా లోకేష్

( ఆంధ్రప్రభ , అమరావతి ) : ‘‘ ప్రజా సేవచేయాలనే మంగళగిరి వచ్చా.. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఐదేళ్లుగా ప్రజల వెన్నంటే ఉంటున్నా.. నేను చేసిన మంచిపనులు చూసి గెలిపించండి”అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఒక్క పనిచేయలేని ఎమ్మెల్యే ఆర్కే అసమర్థుడని, ఎన్నికలు రావడంతో నిన్న ఒక అపార్ట్ మెంటుకు వెళ్లి మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావని అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరేదైనా ఉంటుందా అని మండి పడ్డారు.

కాంటినెంటల్ కాఫీ, కోకోకోలా యూనిట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ చెప్పారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటోనగర్ కి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఆదివారం టిడ్కో ఇళ్ల వద్ద ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ఐటీ పార్క్ లో ఏర్పాటు చేసిన ఐటీ పరిశ్రమల సముదాయంతో సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేశానని చెప్పారు. ఆర్కే చేతగాని చర్యల కారణంగా మంగళగిరి యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని దక్షిణ భారత్​లోనే గోల్డ్ హబ్ గా చేసి 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని లోకేష్ వివరించారు.

- Advertisement -

కూల్చివేతలకు పేటెంట్ జగన్, ఆర్కేలదే!

మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, కూల్చివేతలకు పేటెంట్​ హక్కు జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డిలదే అని లోకేష్​ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద, ఆత్మకూరు, ఇప్పటంలో పేదల ఇళ్లు ఎవరు కూల్చారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా రెండు కుటుంబాలకు అధికారం ఇచ్చారని, తాను చేసిన సేవా కార్యక్రమాల్లో 10 శాతం కూడా గెలిచినవారు చేయలేదని తెలిపారు. మంగళగిరిలో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ను, మంగళగిరి ఎమ్మెల్యే గా తనను గెలిపిస్తే దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

అపార్ట్ మెంట్ వాసుల విన్నపాలు

శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులు సమస్యలను లోకేష్​కు వివరించారు. తమ ప్రాంతంలో రిక్రియేషన్ పార్కులు ఏర్పాటుచేయాలని, తాడేపల్లి పట్టణంలో పన్నులు హైదరాబాద్ లో కూడాలేవని, పన్నుల భారం తగ్గించాలని కోరారు. దేశరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. యువనేత లోకేష్ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి ముఠాల ఆటకట్టిస్తాం. గంజాయిపై ఇప్పటికే ప్రధాని, హోంమంత్రికి లేఖ రాశామని.. బ్లాక్ డెవలప్ మెంట్ మోడల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రోడ్లు, తాగునీటి వసతి,పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన చోటే గెలిచి నన్ను విమర్శించే వారికి సమాధానం చెబుతానని లోకేష్ అన్నారు. జనసేన ఇన్ ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… అమరావతిని నాశనం చేయడం ద్వారా ఒకతరం భవిష్యత్ నాశనం అయిందని.. నేడు రాజధానిలో సెక్యూరిటీ ఆంక్షల మధ్య తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోందని, పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవు అన్నారు. గత ఎన్నికల్లో ఓడినా లోకేష్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నారని చెప్పారు. బిడ్డల భవిష్యత్తు కోసం లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement