Saturday, May 11, 2024

AP | బ్యూటీ పార్లర్​లో దారుణ హత్య.. చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌

చిత్తూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఒక బ్యూటీ పార్లర్ లో మంగళవారం సాయంత్రం ఓ మహిళ అనూహ్యంగా మరణించింది. ఆమెకు సమీపంలో తీవ్ర రక్తగాయాలతో ఒక యువకుడు కొన‌ప్రాణంతో కనిపించడం సంచలనం రేపింది. మరణించిన మహిళ ఒక కానిస్టేబుల్ కుమార్తె కాగా, ఆ యువకుడు ఆమెకు పరిచయస్తుడే అని ప్రాధమిక దర్యాప్తు లో తేలింది. మొదటగా ఆమెను గొంతు కోసి హత్య చేసినట్టు భావించారు. పరిశీలించిన అనంతంరం ఆమె ఒంటి పై ఎటువంటి గాయాలు లేవని నిర్ధారించుకొని మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

సంఘటనా స్థలాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ .రిశాంత్ రెడ్డి పరిశీలించిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో కొండమిట్ట ప్రాంతంలో నివాసముంటూ, చిత్తూరులో విధులు నిర్వహిస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ రెండో కుమార్తె దుర్గను చిత్తూరు నగారానికి చెందిన చక్రవర్తి అనే యువకుడు హతమార్చి, తన మెడ, చేతుల భాగాలను కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాధమిక దర్యాప్తులో తెలిసింద‌న్నారు.

పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత ఆమె ఎలా చనిపోయింద‌న్న వివ‌రాలు తెలుస్తాయ‌న్నారు. దుర్గకు, చక్రవర్తికి కొంత కాలంగా పరిచయాలు ఉన్నాయని, ఒక నెల క్రితం చక్రవర్తి చిత్తూరుకు వచ్చి స్థిరపడి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు త‌మ విచారణలో తెలిసిందన్నారు. నిందితుడు దుర్గను ఎందుకు చంపాడు, వీరిరువురు కాకుండా వేరే ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టార‌న్నారు. త్వరితగతిన కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగానే ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement