Thursday, May 2, 2024

బోర్డు పరీక్షలు వద్దు.. సుప్రీంకోర్టు చెప్పినట్టు నడుచుకో..

రాష్ట్రంలో పరీక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళే మరో లేఖ రాశారు. బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని, తద్వారా విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. పరీక్షల నిర్వహణ అంశంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందన్న విషయం స్పష్టమైందని పేర్కొన్నారు.

కొత్తగా కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయం అని రఘురామ పేర్కొన్నారు. పరీక్షలు రద్దు చేసినట్టు ప్రకటిస్తే సుప్రీంకోర్టుకు తగిన గౌరవం ఇచ్చిన వారవుతారని అభిప్రాయపడ్డారు. మంచి నాయకుడని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అని తెలిపారు. ఇప్పటికే దేశంలో 18 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని, ఆ రాష్ట్రాల బాటలో పయనిస్తే విద్యార్థుల భవిష్యత్ కాపాడిన వారవుతారని సీఎం జగన్‌కు రఘురామ సూచించారు.

కాగా, పీసీఏ చైర్మన్ గా విశ్రాంత జడ్జి జస్టిస్ కనగరాజ్ ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement