Monday, May 6, 2024

నిన్న ఆనందం.. నేడు విషాదం.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వెంట వెంటనే  రెండు సంఘటనలు.. ఒకటి ఆనందం.. మరొకటి విషాదం. మొదటి రోజు పెళ్లిలో అక్షింతలు చల్లి.. వరున్ని ఆశీర్వదించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరుసటి రోజే.. వరుని తండ్రి మృతదేహానికి నివాళులు అర్పించాల్సి వచ్చింది. ఈ రెండు సంఘటనలు తలచుకుని ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులైన ఎంపీ గోరంట్ల మాధవ్ మానవ సంబంధాలకు అత్యంత విలువ ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తండ్రీ కొడుకుల జీవితాల్లో ఎదురైన విధి వైచిత్రిని కళ్లారా చూసిన ఎంపీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

సౌమ్యునిగా పేరొందిన వెంకటస్వామి పామిడి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఏఎస్ఐ వెంకటస్వామికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తో ఆత్మీయ అనుబంధం ఉంది. గతంలో అనంతపురం వన్ టౌన్ సీఐగా మాధవ్ పని చేస్తున్నప్పుడు హెడ్ కానిస్టేబుల్గా వెంకటస్వామి విధులు నిర్వర్తించారు. వెంకటస్వామి కుమారుని వివాహానికి ముఖ్యఅతిథిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరై నూతన జంటను ఆనందంగా ఆశీర్వదించారు. ఆ తర్వాత పెనుగొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. అయితే, అంతలోనే గుండెపోటుతో వెంకటస్వామి మృతి చెందారని విషయం తెలిసి ఎంపీ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

“నిన్న వెంకటస్వామి కుమారున్ని ఆశీర్వదించడానికి వచ్చిన నేను…  నేడు వెంకట స్వామి కి శ్రద్ధాంజలి ఘటించడానికి రావడం తీవ్ర బాధాకరం. వెలుగు తర్వాత చీకటి.. సంతోషం  వెంటే దుఃఖం ఉండడమంటే ఇదేనేమో… నా మనసంతా మాటల్లో చెప్పలేని వేదనతో నిండిపోయింది. ఇలాంటి విషాద సందర్భం ఎవ్వరికీ రాకూడదు”  అని ఎంపీ గోరంట్ల మాధవ్ బాధాతప్త హృదయంతో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement