Thursday, May 2, 2024

సుబాబుల్​ తోటలో బట్టల్లేకుండా బాలిక డెడ్​బాడీ.. రేప్​ చేసి చంపేశారనే ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడ దగ్గరున్న కీసర సమీపంలోని సుబాబుల్ తోటల్లో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తల్లిదండ్రులకు చెబుతుందనే భయంతోనే మేనమామ ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక స్ర్కాప్​ ఏరుకునే వ్యక్తి అని, అదే గ్రామంలో నివసిస్తుందని పోలీసులు తెలిపారు. మొన్న రాత్రి ఈ ఘటన జరగ్గా, బుధవారం ఉదయం తమకు తెలిసిందని నందిగామ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జి నాగేశ్వర రెడ్డి తెలిపారు. దుస్తులు లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గ్రామస్థులు గమనించి తహసీల్దార్‌కు, పోలీసులకు సమాచారం అందించారు.

కంచికచెర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మైలవరం వెళ్లాల్సి రావడంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను కీసరలో తాతయ్య వద్ద వదిలి వెళ్లారు. కాగా, బాలిక మేనమామ పి.సైదులు స్క్రాప్ సేకరిస్తానని చెప్పి తీసుకెళ్లాడని బాలిక బామ్మ పోలీసులకు తెలిపింది. అతను బాలికను పొలంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పొట్టనబెట్టుకున్నాడని ఆరోపించింది. బాలిక మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ముందు బాలికను లైంగికంగా వేధించారా, లేదా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement