Saturday, May 4, 2024

పోలవరంపై కేంద్రం కీలక భేటీ.. ప‌నుల పురోగ‌తి, నిధుల అంశంపై చ‌ర్చ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర జలశక్తి శాఖ సమీక్షించింది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించిన ఈ సమావేశంలో జలశక్తి శాఖకు చెందిన అధికారులతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు స‌మాచారం.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సీడబ్ల్యుసీ డామ్ డిజైనింగ్ కమిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై మరో కీలక సమావేశం జరుగనుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న డిజైన్లపై డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) చైర్మన్‌ ఏబీ పాండ్యా అధ్యక్షతన సమావేశం జరుగనున్నట్టు సమాచారం. 2020లో గోదావరిలో 23లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి డయాఫ్రం వాల్‌ చుట్టూ ఏర్పడ్డ సుడుల కారణంగా భారీ గొయ్యి ఏర్పడింది. దానిని పూడ్చే ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో డీడీఆర్‌పీ భేటీ కానున్నారు. పనులు ముందుకు సాగాలంటే ఈ సమావేశం చాలా కీలకమని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement