Monday, April 29, 2024

ప్రేమోన్మాదికి మరో విద్యార్థిని బలి

మహిళల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. కొందరు ప్రేమోన్మాదుల్లో మార్పు రావడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి మరో విద్యార్థిని బలైంది. తన ప్రేమను నిరాకరించిందని ఇంట్లోనే ఆమెను చంపిన యువకుడు తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని గూడూరులో గురువారం చోటుచేసుకుంది.

పోలీసులు కథనం ప్రకారం… గూడూరుకు చెందిన పి.సుధాకర్‌, సరిత దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి కుమార్తె తేజశ్వని, కుమారుడు కార్తీక్ ఉన్నారు. తేజశ్వని ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది. సుధాకర్‌ సహోద్యోగి చెంచుకృష్ణయ్య కుమారుడు వెంకటేష్‌కు, తేజశ్వనికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. తనను ప్రేమించాలంటూ వెంకటేష్ ఆమెను తరుచూ వేధించేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన తేజశ్వని ఈ విషయాన్ని పెద్దలకు చెప్పింది. దీంతో వెంకటేష్‌ను తండ్రి చెంచుకృష్ణయ్య బెంగళూరుకు పంపారు.

కరోనా కారణంగా ఈ ఏడాది మొదట్లో వెంకటేష్‌ గూడూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులకు తట్టుకోలేక ఆమె తన ఫోన్‌ నంబరు మార్చేసింది. దీంతో తనను పట్టించుకోని తేజశ్వనిపై కక్ష పెంచుకున్నాడు. గురువారం(జులై 1) సుధాకర్‌, సరిత… పాఠశాలకు వెళ్లగా తేజశ్వని, ఆమె తమ్ముడు కార్తిక్‌ ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటేష్‌, తన స్నేహితుడిని వెంటబెట్టుకుని తేజశ్వని ఉండే అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చాడు. తాను కిందే ఉండి స్నేహితుడిని పైకి పంపించాడు. అతను వారి ఫ్లాట్‌కు వెళ్లి తేజశ్వనిని ఫోన్‌ నంబరు అడిగాడు. దీంతో కార్తిక్‌ అప్రమత్తమై ఈ విషయాన్ని తండ్రికి చెప్పేందుకు తన ఫోన్‌ తీసుకుని కిందికి వచ్చాడు. కార్తిక్‌ కిందికి రావడాన్ని గమనించిన వెంకటేష్‌ వెంటనే వేగంగా పైకి వెళ్లి తన స్నేహితుడిని అక్కడి నుంచి పంపేశాడు. తేజశ్వని ఉన్న గదిలోకి వెళ్లి తలుపు మూసి పదునైన చాకుతో ఆమె గొంతులో పొడిచాడు. తర్వాత చున్నీని ఆమె మెడకు బిగించి చంపాడు.

కార్తిక్‌ ద్వారా విషయం తెలుసుకున్న సుధాకర్‌.. పోలీసులకు ఫోన్‌ చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూసి ఉన్న గది తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లగా… అపస్మారక స్థితిలో పడి ఉన్న తేజశ్వని… చీరతో కిటికీకి ఉరేసుకున్న వెంకటేష్‌ కనిపించారు. పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. తేజశ్వని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసులురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్‌, అతడి తండ్రి చెంచుకృష్ణయ్య, వెంకటేష్‌ స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు చ‌ట్టాలు ఎన్ని తెచ్చినా ఇలాంటి దురాగ‌తాలు చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఇది కూడా చదవండి: కడియంపై కేసీఆర్ లెక్క ఇదేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement