Sunday, April 28, 2024

Major Reservoirs – డెడ్ స్టోరేజ్! తగ్గిపోతున్న నీటి నిల్వలు

శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో పడిపోయిన వాటర్ లెవల్స్
డెడ్ స్టోరేజీకి కేవ‌లం అడుగు దూరంలోనే సాగ‌ర్
ప్రస్తుతం ఉన్నది 133 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే
శ్రీశైలంలో కేవ‌లం 34 టీఎంసీల నీళ్లే
గ‌త ఏడాదితో పోలిస్తే వేగంగా త‌గ్గిపోతున్న లెవ‌ల్స్‌
సాగునీరు దేవుడికెరుక‌.. తాగునీటికి తప్పని ఇబ్బందులు
జంట న‌గ‌రాల‌కూ పొంచి ఉన్న తాగునీటి గండం

ఏపీ, తెలంగాణలోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జునసాగర్‌ అడుగంటుతోంది. దీంతో సాగర్లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతున్నాయి. సాగర్, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. ఏపీ, తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న నాగార్జునసాగర్ తీవ్ర వర్షాభావంతో వట్టి పోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక సాగర్ నిండుకుంటోంది. దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వానాకాలం, యాసంగి సీజన్లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. మరోవైపు వేసవి కాలం ప్రారంభం నుంచే సాగర్, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రం అయ్యింది.

డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నీటి మట్టం..

590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 510.7 అడుగుల నీటిమట్టంతో 132.05 టీఎంసీల నీరు ఉంది. సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు 131 టీఎంసీలుగా నిర్ణయించారు. అయితే.. డెడ్ స్టోరేజీకి కేవలం అడుగు దూరంలోనే ఉంది సాగర్ డ్యామ్. దీంతో నాగార్జునసాగర్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 528.30 అడుగులతో 164 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాదితో పోల్చితే నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో 31 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది.

తాగునీటికి కటకట…

- Advertisement -

నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. సాగర్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు 550 క్యూసెక్కులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

వాటర్ లెవల్స్ తగ్గడంతో..

ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో తాగునీటికి ప్రమాదం పొంచి ఉంది. సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. డెడ్ స్టోరేజీకి ఎగువన కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్లలో తాగునీటికి సరిపడా నీరు ఉంది. మే, జూన్, జులై మూడు నెలలకు తాగునీటికి ఇబ్బందులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

జీరో లెవల్ నుంచి పుట్టంగండి వద్ద పంపింగ్

హైదరాబాద్ జంట నగరాలకు ప్రస్తుతం పుట్టంగండి ఎత్తిపోతల పథకం మంచినీటి సరఫరాను జరుగుతోంది. 510 అడుగుల డెడ్ స్టోరీకి దిగవకు నీటిమట్టం పడిపోతే పంపింగ్ కష్టమే అవుతుంది. నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినప్పుడు బ్యాక్‌ వాటర్‌ వద్ద జీరో పాయింట్ నుంచి డ్రెడ్జింగ్‌ ప్రక్రియతో భారీ మోటార్లతో పంపింగ్‌ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు 1450 కోట్ల రూపాయలతో సుంకిశాల వద్ద మూడోదశ పైపు పనులు కూడా కొనసాగుతున్నాయి. మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అత్యవసర పనులను చేపడుతున్నారు.

ఏపీ తాగునీటి అవసరాలకూ ఇక్కడి నుంచే..

మరోవైపు ఏపీ తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో తొందర్లోనే డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. భవిష్యత్ అవసరాలకు శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే చాన్స్ కూడా లేదు. ఇప్పటికే ఆ రెండు ప్రాజెక్టులు వట్టిపోయి ఉన్నాయి. మరో మూడు నెలల పాటు తాగునీటి అవసరాలు ఎలా తీర్చుకోవాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

డెడ్ లెవెల్‌కు చేరువలో శ్రీశైలం జలాశయం

అటు నంద్యాల జిల్లాతోపాటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీరందించే శ్రీశైలం జలాశయం ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోయి వెలవెలబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన 215 టీఎంసీలకు గాను.. ఇప్పుడు మిగిలింది కేవలం 34 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక.. ఈ ఎండాకాల సీజన్‌లో రెండు రాష్ట్రాల ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలసిన పరస్థితి ఏర్పడనుంది.

శ్రీశైలం 215 టీఎంసీలకు.. 34 టీఎంసీలు మాత్రమే..

శ్రీశైలం జలాశయంలో గత ఏడాది ఏప్రిల్ 10 ఇదే సమయానికి 805.40 అడుగులుగా, 31.73టీఎంసీల నీరు నిల్వ‌ ఉంది.. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుతం 809.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామార్ద్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.24 టీఎంసీలుగా నమోదైంది. ఇక‌.. నాగార్జున సాగ‌ర్‌లో గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి 528 ఫీట్లు, 164 టీఎంసీల వాట‌ర్ లెవ‌ల్స్ ఉన్నాయి. కాగా, ఈ ఏడాది సేమ్ టైమ్‌లో 511 అడుగులు, 133 టీఎంసీల నీరు మాత్ర‌మే ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement