Friday, April 26, 2024

నారా లోకేష్ ప్ర‌చార వాహ‌నం సీజ్.. పోలీసుల‌తో టిడిపి నేత‌ల వాగ్వాదం..

పలమనేరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేయడంతో గురువారం యువగళం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.. వాగ్వివాదానికి దిగిన లోకేశ్ తన వాహనాన్ని వదిలే వరకు ఇక్కడే ఉంటానని పట్టుపట్టడంతో పోలీసులు వాహనాన్ని వదిలి పెట్టారు. పలమనేరు నియోజకవర్గంలో కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం లోకేశ్ పలమనేరు పట్టణంలో యాత్రను కొనసాగించారు.

ఒక చోట తన కాన్వాయ్ వాహనం పైకి ఎక్కి మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో కలిసి గుమీకూడిన ప్రజలను ఉద్దేశించి అరగంట పాటు ప్రసంగించారు. తరువాత వాహనం దిగి ముందుకు సాగుతుండగా ఆయన వేదికగా ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.. ఆ విషయం తెలిసిన లోకేశ్ తన వాహనం వదిలితే కానీ ముందుకు వెళ్లనని రోడ్డుపై నిలబడుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.. సభ నిర్వహించడానికి అనుమతి లేదని చట్ట ప్రకారం సీజ్ చేశామనీ  పలమనేరు డీఎస్పీ వివరించడానికి యత్నించినా లోకేశ్ ఒప్పుకోలేదు. పాదయాత్రలో భాగంగా జనం కోరిన చోట్ల స్టూల్ వేసుకుని మరీ నిలబడి మాట్లాడి వెళ్తున్నానని, పలమనేరులో జనం ఎక్కువగా ఉన్నందున రోడ్డు పక్కగా వాహనంపైకి ఎక్కి కొంత సేపు మాట్లాడానని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రిపై పరుష పద్యంతో దూషించానని అంటే చంద్రబాబు సీఏంగా ఉన్నప్పుడు కాల్చి పారేయాలని, ఉరి తీయాలని, బంగాళాఖాతంలో పారేయాలని అన్నవారి కన్నా ఏమీ ఎక్కువగా మాట్లాడలేదని లోకేష్ తన వాదన వినిపించారు. ఊరు దాటి వెళ్లిపోతుంటే వాహనం సీజ్ చేయడం ఏమిటని అంటూ ఆ వాహనాన్ని వదిలేదాకా ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. చివరకు పోలీసులు ఆ వాహనాన్ని వదిలి వేయడంతో లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement