Monday, April 29, 2024

ఉక్కు చుట్టూ రాజ‌కీయం – నేడే బిడ్స్ దాఖ‌లుకు చివ‌రి రోజు

విశాఖ‌ప‌ట్నం – తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం విశాఖ ఉక్కు చుట్టూనే తిరుగుతోంది. నేతల మాటలు ఉక్కు తూటా ల్లా పేలుతున్నాయి. ఏపీలో అధికార పక్షం వర్సెస్‌ తెలంగాణ పాలక పక్షం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ప్రస్తుతానికి ప్లాంట్‌ ప్రైవేటీకరణ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించగా ఈ క్రెడిట్‌ను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. విశాఖ ఉక్కు మంటలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీటును ఒక్క సారిగా పెంచేశాయి. నేతల మాటల వేడి వేసవి వేడిని మించి పోతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదన్న అంచనాల మధ్య బీఆర్‌ఎస్‌ ఎంట్రీ ఇచ్చింది. సింగరేణిని దించింది. ఈక్విటీ బిడ్‌ వేస్తామని ప్రకటిం చింది. కేంద్ర మంత్రి ప్రస్తుతానికి ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడంలేదన్నారు. దీనిపై వెంటనే రంగంలోకి దిగి న బీఆర్‌ఒఎస్‌ తమ దెబ్బకే ప్రైవేటీకరణ ఆగిందని చెప్పడంతో ఏపీ మంత్రులు ఫైరయ్యారు. ఉట్టికి ఎగర లేనమ్మ ఆకాశానికి ఎగిరిందన్నట్లు టీఆర్‌ఎస్‌ మాటలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీలు ప్లాంట్‌ ప్రైవేటీ కరణపై కేంద్రం వీళ్లను చూసి వెనక్కి తగ్గిందా అని ప్రశ్నించారు. అలా అయితే తెలంగాణాలో సింగరేణి ప్రైవేటీ కరణలో కేంద్రం ఎందుకు తగ్గడం లేదో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఈ క్రెడిట్‌లోకి బీజేపీ ఎంపీ జీవిఎల్‌ కూడా దిగారు. విశాఖ స్టీలు ప్లాంటును నిలబెట్టేందుకు తాము కృషిచేస్తుంటే టీఆర్‌ఎస్‌ డబ్బా కొట్టుకుంటోందన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని బీఆర్‌ఎస్‌ పార్టీ స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ ఫైర్‌ అయ్యారు. రూ. 6756 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇవ్వాలని కేంద్రం ఆదేశిస్తే ఎందుకు చెల్లించలేదని నిలదీశారు.

నేటితో ముగియనున్న ఇఓఐ బిడ్డింగ్ – పాల్గొనే అవకాశాలపై భారాస విస్తృత పరిశీలన
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం అదే జోరు కొనసాగి స్తోంది. ఏమాత్రం తగ్గేదేలే అన్న వ్యవహారంగా తొలివిడత ఇఓఐకి సంబంధించిన బిడ్డింగ్‌ను పూర్తి చేసేందుకు త్వరితగతిన సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రూ.5వేల కోట్లు నిధులు సేకరణకు (ఇఓఐ) సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. దీని ప్రకారం కనీస మూలధనం విలువ రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన సంస్థకు స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసే స్టీల్‌ను అందజేయడం జరుగుతుంది. ఈ బిడ్‌లలో పాల్గొనడానికి నేటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కొన్ని సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇందులో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నట్లు అధికారులు ద్వారా తొలుత ప్రచారం జరిగింది. కేవలం ప్రయివేటు సంస్థలకు మాత్రమే బిడ్‌లలో పాల్గొనే అవకాశం ఉందని అంటూ వచ్చారు. అయితే ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బిడ్‌లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే భారాస తరుపున సింగరేణి కంపెనీకి చెందిన డైరెక్టర్ల బృందం ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌కు రావడం రెండు రోజుల పాటు పలువురు డైరెక్టర్లు, సిఎండితో భేటీ కావడం, సాద్యాసాద్యాలపై చర్చించడం జరిగింది. ఈ బిడ్డింగ్‌లో సింగరేణి కంపెనీ తరుపున కూడా బిడ్‌ వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మరో వైపు కొందరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు, కేంద్ర, ఉక్కు సహాయమంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే సైతం బిడ్‌లో భారాస పాల్గొంటుందని ప్రకటించడం రాజకీయ ఎత్తుగడ అని కొట్టిపారేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement