Tuesday, April 30, 2024

ఓర్వ‌క‌ల్లు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి ఎయిర్ పోర్ట్ ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన జ‌గ‌న్..

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎపి ప్ర‌జ‌ల‌కు నేడు అంకితం చేశారు.. ముందుగా జగన్ ఎయిర్ పోర్ట్ లోని జాతీయ జెండాను , ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించారు.. కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా అందుబాటులోకి రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని అన్నారు.. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాల స‌ర్వీసులు న‌డుస్తాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరోదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్‌ కటింగ్‌తో హడావుడి చేసిందని, అయితే త‌మ ప్ర‌భుత్వం రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని తెలిపారు. అనంతరం ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముందుగా, ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ భవనం ముందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత డిపార్చర్ గేటు వద్ద రిబ్బన్ కటింగ్ చేసి విమానాశ్రయాన్ని ప్రారంభించారు జగన్ . అనంతరం, విమానాశ్రయం లోపల భవనాలను పరిశీలన చేసి..సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగారు. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు బయలు దేరి వెళ్లారు.. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న లోకల్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తో జిల్లా ప్రజల కలలను నిజం చేసారని..అలాగే తన నియోజకవర్గంలో మల్లికార్జున స్వామి రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బి.వై రామయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. కాగా,. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్‌ జారీ చేయగా.. బీసీఏఎస్‌ సెక్యూర్టీ క్లియరెన్స్‌ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement