Wednesday, May 15, 2024

అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం ….మేయర్ రామయ్య..

కర్నూల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి.. కృతజ్ఞతలని కర్నూలు కార్పొరేషన్ మేయర్ బి వై .రామయ్య అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతం గా నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలే తమ విజయానికి ముఖ్య కారణంగా పేర్కొన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడానికి మీడియా పాత్ర కీలకమైనదని అన్నారు. కర్నూల్ కార్పొరేషన్ ను అభివృద్ధి బాటలో ఉంచడమే తన ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుంచేందుకు మీడియా నిర్మాణాత్మక సహాకారం అందించాలని మేయర్ కోరారు. కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్టు చెప్పారు. సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందరి సమన్వయంతో, ముఖ్యమంత్రి సహాకారంతో కర్నూలును అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలును కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు టెక్నాలజీ సహాయం తీసుకోనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి అనునిత్యం వెన్నంటి ఉంటూ సహకారం అందించిన రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్, రేవిన్యూ శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement