శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్ అతిథిగృహం వద్ద జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఆలయ ఈవో కేఎస్ రామారావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభం, వేద మంత్రోచ్ఛారణలతో సీజేఐ దంపతులను ఆలయంలోకి ఆహ్వానించారు.
జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఇటీవలే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుపతిలో శ్రీవారిని, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.