Thursday, May 9, 2024

పొట్టి శ్రీరాములు విగ్ర‌హానికి .. నివాళులు..

నందిగామ ప్రభ న్యూస్ : భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. నందిగామ పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ సెంటర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి , పార్టీ కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని తెలిపారు. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలన్న సంకల్పంతో అమరజీవి ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

అదేవిధంగా ఎంతోమంది మహనీయుల త్యాగాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దిశగా నడిపించాలన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపితేనే ఆ మహనీయుల త్యాగాలకు ఫలితం చేకూర్చినట్లని తెలిపారు. మహాత్మా గాంధీ, బి ఆర్ అంబేద్కర్, అమరజీవి పొట్టి శ్రీరాముల స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మండవ వరలక్ష్మి , కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement