Thursday, May 2, 2024

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. దుకాణాలకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు..

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నడ యువకులు వీరంగమేశారు. ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద కర్ణాటక, స్థానిక భక్తుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది మరింత పెరిగి తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడికి కారణమైంది.

ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో కర్ణాటక భక్తుడిపై టీ షాపు యజమాని గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడడంతో వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

దాడితో ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడ భక్తులు స్థానిక దుకాణాలకు నిప్పు పెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లతో పాటు, తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement