Monday, April 29, 2024

Kakinada – నామినేష‌న్ ర్యాలీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్యాన్స్

కాకినాడ – ఎన్నిక‌ల నామినేష‌న్ ర్యాలీలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్యాన్స్ చేశారు. కాకినాడ జ‌న‌సేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో ప‌వ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జనసేనాని డ్యాన్స్ చేసి జనసైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

కాగా, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి పవన్ కూడా హాజరయ్యారు.

- Advertisement -

చేబ్రోలులోని తన నివాసం నుంచి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా కాకినాడ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో కాకినాడలో జనసైనికుల కోలాహలం మిన్నంటింది.

నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న నేను పిఠాపురంలో నామినేషన్ వేశాను. ఇవాళ జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఆయన టీ టైమ్ ఉదయ్ గా ఎంతో పాప్యులర్ అయ్యారు.ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవి. ఈ ఎన్నికలు ఐదేళ్ల కోసం కాదు… ఒక తరం కోసం! ఈ ప్రాంతంలో మంచి తీర ప్రాంతం ఉంది, అపార మత్స్యసంపద ఉంది… రిలయన్స్, ఓఎన్జీసీ, కాకినాడ ఎస్ఈజెడ్ ఉన్నాయి… ఇలాంటి చోట అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు ఎంతో అవసరం

కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారింది. పదిహేనేళ్ల పిల్లలు కూడా గంజాయికి అలవాటుపడ్డారు. వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జగన్ కు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు. కానీ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. శాంతిభద్రతలు క్షీణించిపోయాయి. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అందుకే, మేం 2014లో ఎలా కలిసి వచ్చామో, ఇప్పుడు కూడా బలమైన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి స్వీప్ చేయబోతోంది” అంటూ పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement