Thursday, May 9, 2024

Jana Senani – ఇన్నాళ్లు గౌర‌వించా.. ఇక ఆ గౌర‌వాలు లేవు – జ‌గ‌న్ కు ప‌వ‌న్ అల్టిమేటం

ఏలూరు – ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంచివాడా, చెడ్డవాడా అని చూడకుండా, సీఎం స్థానానికి విలువ ఇచ్చి జగన్ రెడ్డి గారు అని గౌరవించానని , అయితే, ఈ రోజు నుండి అంబేద్కర్ సాక్షిగా జగన్ రెడ్డిని ఏకవచనంతోనే పిలుస్తానని జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని వ్యాఖ్యానించారు. అతడి పార్టీ వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని అన్నారు. 2024లో జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు.

రెండో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ..
వారాహి విజయ యాత్ర రెండో దశకు ఏలూరులో ఇంతటి ఘనస్వాగతం లభిస్తుందని తాను అనుకోలేదని, దారిపొడవునా అక్కచెల్లెళ్లు, తల్లులు ప్రేమాభిమానాలు చూపించారని వెల్లడించారు. తానేమీ సరదాగా రాజకీయాల్లోకి రాలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేను ఇన్ని బాధలు, అవమానాలు ఎందుకు పడాలి? గెలుపోటములతో పనిలేకుండా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని వివరించారు. అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.

వైఎస్ జగన్, వైసీపీకి మనం బానిసలు కాదని.. ఆయనా మనలో ఒకడు మాత్రమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మనం ట్యాక్సులు కడితే .. ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తని .. జగన్ కేవలం జవాబుదారీ మాత్రమేనని జనసేనాని పేర్కొన్నారు. 2024లో వైసీపీ, వైఎస్ జగన్ రాష్ట్రానికి అవసరం లేదని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. తాను రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటే.. వైసీపీ నాయకులు తన తల్లి, ఇంట్లో ఆడవాళ్లు, పిల్లల గురించి మాట్లాడుతూ అవమానిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చూశారు. హల్లో ఏపీ.. బై బై వైసీపీ అనే నినాదం తనది కాదని ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిందన్నారు.

తాను ఏం మాట్లాడినా వక్రీకరించి, వంకరగా, వెకిలిగా మాట్లాడతాడంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. తాను ఏం మాట్లాడిన రాష్ట్ర ప్రజల కోసమే మాట్లాడతానని తెలిపారు. యువతీ, యువకుల ఉద్యోగ సమస్యలు, ఆడపడుచుల రక్షణ, రోడ్లు, గంజాయి సమస్యలు ఇలా ఎన్నో వున్నాయని పవన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement