Monday, April 29, 2024

జ‌గ‌న్ స‌రికొత్త ప్ర‌చార ప‌ర్వం – బ‌స్సు యాత్ర‌, ప‌ల్లె నిద్ర‌

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఇటు ప్రభుత్వపరంగా అటు పాలనా పరంగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. గతంలో పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను నేరుగా కలుసుకుని వారి ఆశీస్సులతో రాష్ట్రంలో 151 స్థానాలను సొంతంచేసుకుని వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా సీఎం జగన్‌ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగం గానే ఇప్పటివరకూ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయించిన ఆయన ఇక ప్రజల్లోకి నేరుగా వెళ్లాలని యోచిస్తున్నారు.

అందుకోసం పల్లె నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లిd బడ్జెట్‌ సమావేశాల తరువాత బస్సు యాత్ర నిర్వహించడంతోపాటు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తున్నారు. ఆదిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. అసెంబ్లిd సమావేశాల తరువాత రూట్‌మ్యాప్‌ కూడా ఖరారు చేయనున్నారు. వీటికంటే ముందుగా మరో వినూత్న కార్యక్రమానికి జగన్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 11 నుండి సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అనే నినాదంతో స్టిక్కర్లను అంటించనున్నారు. పై మూడు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో మరింత మమేకం కావాలని సీఎం జగన్‌ యోచిస్తూ ఆదిశగా అడుగులు వేయబోతున్నారు. కీలకమైన పై మూడు కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్‌ ముఖ్యమైన నాయకులతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది.

పల్లె నిద్ర బస్సు యాత్ర :
ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వివిధ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అందులో భాగంగానే టీడీపీ యువగళం పేరుతో లోకేష్‌ పాదయాత్రను ప్రారంభించారు. మరోవైపు జనసేన అధినేత కూడా త్వరలో వారాహి యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలను రూపొదించుకుంటోంది. అయితే, ఇప్పటికే నవరత్నాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు అవసరమైన సంక్షేమ ఫలాలను అందిస్తున్న సీఎం జగన్‌ ఇప్పటివరకూ ప్రజలకు అందిన పథకాల గురించి వివరించేందుకు పల్లె నిద్ర బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పర్యటిస్తూ ప్రతి రోజూ ఏదో ఒక గ్రామంలో పల్లె నిద్ర చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పల్లె నిద్ర చేసే సందర్భంలో రచ్చబండ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలోనే రచ్చబండ నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోవిడ్‌ తదితర కారణాలవల్ల రచ్చబండ కార్యక్రమం కొంత జాప్యం జరిగింది. అయితే, మార్చి 2,3 తేదీల్లో ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల తరువాత పల్లె నిద్రకు వెళ్లనున్నారు. ఆకార్యక్రమంలో భాగంగా పల్లె నిద్రచేసే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలతో సీఎం జగన్‌ నేరుగా మమేకం కానున్నారు.

అసెంబ్లి తరువాత .. రూట్‌ మ్యాప్‌ ఖరారు :
పల్లె నిద్ర బస్సు యాత్ర కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే సీఎం జగన్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్య నాయకులతోపాటు మరికొంతమంది ఉన్నతాధికారులతో కూడా పై రెండు కార్యక్రమాలపై చర్చించారు. అయితే, అసెంబ్లిd సమావేశాల తరువాత బస్సు యాత్ర పల్లె నిద్ర కార్యక్రమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో రూట్‌ మ్యాప్‌ ఖరారు కానుంది. జిల్లాల వారీగా కార్యక్రమాలను నిర్వహించాలా..లేక రాష్ట్రవ్యాప్తంగా ఒకే కార్యక్రమంలా నిరంతరం కొనసాగించాలా..అనే అంశంపై కూడా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఈనెల 11 నుండి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం :
నవరత్నాలతో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ ఒరవడిని సృష్టిస్తున్న సీఎం జగన్‌ తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఇంటికీ ‘మానమ్మకం నువ్వే జగనన్న’ అనే స్టిక్కర్‌ను అంటించనున్నారు. సచివాలయ వాలంటీర్లకు ఆ బాధ్యతలను అప్పగించబోతున్నారు. వారితోపాటు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేయాలని యోచిస్తున్నారు. అయితే, కొన్ని జిల్లాల్లో గృహసారథుల ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాలంటీర్లతోనే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. గృహ సారథులు పూర్తయిన ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితోపాటు గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని పథకాలు అందుతున్నాయని వారి నుండి స్పష్టమైన సమాధానం వచ్చిన తరువాతే స్టిక్కర్లను ఆ ఇంటికి అంటించనున్నారు.

ఎన్నికల వేళ .. జగన్‌ సరికొత్త వ్యూహం :
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ఎప్పటికప్పుడు ప్రత్యర్ధి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడు పెంచుతున్నారు. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సొంతంచేసుకున్న జగన్‌ వచ్చే ఎన్నికల్లో కూడా మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రతి ఎమ్మెల్యేను గడప గడపకు వెళ్లమని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. గత ఏడాది మే 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్‌ వర్క్‌ షాపును నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరును వివరిస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తూ నిరంతరం ఎమ్మెల్యేలను ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వారితోపాటు సీఎం జగన్‌ కూడా ప్రజల్లోకి వెళ్లాలని, అందుకోసమే ప్రత్యేకంగా బస్సు యాత్ర పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement