Sunday, April 28, 2024

గంగమ్మ తల్లికి సారె ఇవ్వ‌డం సంతోషంగా ఉంది.. మంత్రి రోజా

తిరుపతి సిటీ, మే 14, ప్రభ న్యూస్ : గంగమ్మ తల్లికి సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కుటుంబ సభ్యులతో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… బిడ్డలందరినీ చల్లగా చూసుకుంటూ అందరిని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు తల్లులు కోరుకునే విధంగా ఇవ్వడం గంగమ్మ తల్లికే చెల్లుతుంద‌న్నారు. గంగమ్మ తల్లి మన తిరుపతి ఆడబిడ్డని నేను చదువుకునే రోజుల్లో చూసిన గంగజాతరకు ఇప్పుడు జరుగుతున్న గంగ జాతరకు చాలా అభివృద్ధి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఈ గంగమ్మ ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు, త‌మ గురువు, అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి త‌న ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌న్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగ గా ప్రకటించిన ముఖ్యమంత్రి కి త‌న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రజలకే కాకుండా భారత దేశ ప్రజలందరికీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ మహిమ, గొప్పదనం, చరిత్రను, విశిష్టతను తెలియజేసే విధంగా గంగ జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈరోజు వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకోవడం, పొంగలు పెట్టడం, మహా కుంబాభిషేకం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత సంవత్సరంలో మంత్రిగా గంగమ్మ ఆలయానికి రావడం జరిగిందని, ఈ సంవత్సరం గంగమ్మ జాతర రాష్ట్ర పండుగ గా నిర్వహిస్తున్న సందర్భంగా రావడం గంగమ్మ తల్లి ఆశీర్వాదమేనని తెలిపారు. గంగమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అందజేయాలని, రాష్ట్ర పరిపాలనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పరిపాలించే విధంగా ముఖ్యమంత్రికి అమ్మవారు దీవెనలు నిండుగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో కలిసి సారె అందజేసే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి రాష్టంలోనే వివిధ జిల్లాలకు చెందిన వివిధ రకాల కళాకారులు దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించిపోయారు. గంగమ్మ నామ స్మరణతో, నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు, తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల, కళాప్రదర్శన‌లు నడుమ మంత్రి కుటుంబ సభ్యులతో ఊరేగింపుగా సారె తీసుకొని ఆలయం చేరుకోగా.. ఆలయం వద్ద ఎమ్మెల్యే, ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యక పూజ నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో ముని కృష్ణయ్య, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద్ రెడ్డి, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement