Saturday, May 11, 2024

Irrigation Project – శ‌ర‌వేగంగా వెలిగొండ నిర్మాణ ప‌నులు ..

అమరావతి, ఆంధ్రప్రభ: కరువు పీడిత ప్రాంతాల ప్రజల కలలు సాకారమయ్యేలా వెలిగొండ నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబరులోపు ఖచ్చితంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు వర ప్రసాదినిగా భావిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులో కీలక నిర్మాణ దశ అయిన రెండో టన్నెల్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రాధా న్యతా ప్రాజెక్టుల జాబితాలో ఉన్న వెలిగొండ మొదటి టన్నెల్‌ పనులు ఇప్పటికే పూర్తి కాగా కొన్ని అనివార్యమైన సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ రెండో టన్నెల్‌ను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయా ల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీ-వల ఆదేశాలు జారీ చేసింది. రెండో టన్నెల్‌ కోసం అమెరికాకు చెందిన రాబిన్స్‌ సంస్థ నుంచి డబుల్‌ షీల్డ్‌ టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ ను దిగుమతి చేసుకుని గతం లోనే పనులు ప్రారంభించినప్పటికీ టీ-బీఎం, కన్వేయర్‌ బెల్టులో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో నిర్దేశిత సమయంలో సొరంగ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇపుడు రాబిన్‌ సంస్థ ప్రతినిధులు వచ్చి బోరింగ్‌ మిషన్‌ లోని విడి భాగాలకు మరమ్మతులు చేయటంతో ఒక వైపు మిషన్‌ తోనూ, మరో వైపు కార్మికులతోనూ టన్నెల్‌ ను పూర్తి చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు.

మొత్తం 7383 మీటర్ల పొడవున రెండో టన్నెల్‌ తవ్వకం పనులు వేగంగా కొనసాగుతున్నట్టు- ఇంజనీర్లు తెలిపారు. శ్రీశైలానికి వరద వచ్చే ఏడాదిలోని సుమారు 45 రోజుల కాలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా వెలుగొండ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. రెండు టన్నెళ్ళ ద్వారా రోజుకు 11582 క్యూసెక్కుల చొప్పున 43.5 టిఎంసీల నీటిని ఒడిసి పట్టి ప్రకాశంలోని పశ్చిమ ప్రాంతం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేయటమే వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కొండెపి నియోజవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు..మొత్తం 4,47,200 ఎకరాలకు సాగు నీరు, 15.25 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చేలా వెలుగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.


సహాయ పునరావాసంపై దృష్టి
రెండో టన్నెల్‌ పూర్తయ్యలోపు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని నల్లమలసాగర్‌ నిర్వాసితుల సహాయ పునరావాస (ఆర్‌ అండ్‌ ఆర్‌) పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ వల్ల నిర్వాసితులవుతున్న 11 గ్రామాల్లోని 4617 కుటు-ంబాలకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర పునరావాసం కోసం రూ 1510 కోట్లు- అవసరమని లెక్క తేల్చగా రూ 1411 కోట్లను మంజూరు చేసింది. కొత్తగా నిర్మిస్తున్న ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్ళ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాల్సిందిగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్ళకు నీటిని పంపించి నల్లమలసాగర్‌ ను నింపితే ప్రాజెక్టు నిర్మాణంలో కీలక దశ పూర్తవుతుందనీ, ఈ ఏడాది సెప్టెంబరు నాటికే నిర్దేశిత వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు అందుబాటు-లోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే రెండో టన్నెల్‌ పనులపై ప్రభుత్వం ఇపుడు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 27న ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్‌ -1 కింద 1.2 లక్షల ఎకరాలకూ, స్టేజ్‌ – 2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. సుంకేశుల నుంచి తీగలేరు కెనాల్‌ కు నీళ్ళు తరలించటం ద్వారా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన యర్రగొండపాలెంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగుయోగ్యమవుతాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement