Saturday, May 4, 2024

అమ్మవారి బంగారు కాసుల హారం గల్లంతుపై విచారణేది ?

మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారికి ఓ భక్తుడు ఆరు తులాల బంగారు కాసులు ఆహారాన్ని గత మూడు సంవత్సరాల క్రితం వితరణ చేయడం జరిగింది. అంతవరకూ బాగానే ఉన్నా ఆలయ రికార్డులకు ఎక్కకుండా కొందరు కిందిస్థాయి సిబ్బంది లాలూచీ పడి బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రైవేట్‌ బ్యాంకు నుండి అమ్మవారి కాసులు హారాన్ని విడిపించి ఉన్నట్లు సమాచారం. భక్తులు భక్తిభావంతో స్వామి అమ్మవార్లకు సమర్పించిన వీటిని సరైన సమయంలో రికార్డులో నమోదు చేయకపోవడంతో పాటు తమ ఇష్టం వచ్చినప్పుడు, తమ ఇష్టానుసారంగా వాడుకొని రికార్డుల్లో నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు కింది స్థాయి ఉద్యోగులు చేసే తప్పులకు పై స్థాయి ఉద్యోగులు కూడా బలి అవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే దర్యాప్తు చేసిన దేవాదాయశాఖ అధికారుల పై స్థాయి అధికారులను సస్పెండ్‌ చేయడంతో పాటు కింది స్థాయి ఉద్యోగులను షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. తాము కోరుకున్న పోస్టులోనే కింది స్థాయి ఉద్యోగులను నియమించడం పలు విమర్శలకు తావిస్తోంది. అవినీతి అక్రమాలకు మహానంది దేవస్థానం కేంద్రబిందువుగా మారినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారులతో విచారణ జరిపిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడంతో పాటు ఎంతమంది పీఠాలు కదులుతాయో అని చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అధికారులు కూడా అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అందిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలకే లెక్కలు, భద్రత లేకపోతే ఆలయ అభివృద్ధి ఇలా జరుగుతుందని భక్తుల ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement