Sunday, May 19, 2024

మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలో పెరిగిన బాధితులు.. 81 మందికి హాస్పిటల్​లో చికిత్స

నంద్యాల టౌన్‌ /అనంతపురం ప్రభన్యూస్‌: రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మధ్యాహ్న భోజనం వికటించి 81మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలు ఆందోళనకు గురిచేశాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో 45మంది, అనంతపురం జిల్లా పిల్లిగుండ్ల కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శుక్రవారం విద్యార్థులు రోజు మాదిరిగానే చదువుకునేందుకు వచ్చారు. మధ్యాహ్నం యధావిధిగా పొంగలి, పప్పు, సాంబారు, గుడ్లు విద్యార్థులకు వడ్డించారు. తిన్న కొద్దిసేపటికి 45 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే వారిని నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

పాడైన గుడ్లవల్లే …
పాడైన గుడ్లు వండిపెట్టడం వల్లే అవి తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌ రవి పాఠశాలకు ఈనెల 3వ తేదీన సరఫరా చేసిన గుడ్లను పిల్లలకు అందించారు. మామాలుగా గుడ్లు 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అయితే ఇవి రోజుల నుండి నిల్వ ఉంచినవి కావడంతో వాసన వస్తున్నాయని, పిల్లలు ఆ గుడ్లను తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోసిస్తున్నారు. పాఠశాల ఆవరణలో వండటానికి స్థలం లేనందున వంట మనిషి ప్రతి రోజు ఇంటి వద్ద వండి తీసుకువస్తోందని, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అయ్యిందని తెలిసిన ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్‌ రెడ్డి అసెంబ్లి సమావేశంలో ఉండటంతో సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అస్వస్థులైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు.

భూమా అఖిలప్రియ ధర్నా
తమకు పాడయిన గుడ్లు ఇవ్వడంతోనే అస్వస్థతకు గురయ్యామని, పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అఖిలప్రియ ఆసుపత్రి ఆవరణలో నిందితులను శిక్షించాలని నేలపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఘటనకు కారణమైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. కలెక్టర్‌ వచ్చి సంఘటనపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అమ్మ ఒడి అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అస్వస్థతకు లోనైన పిల్లలను ఆసుపత్రికి తీసుకొని రావడానికి స్థానికులు సహకరిస్తే అధికారులు ఏమి చేస్తునట్లు అని ప్రశ్నించారు.

అనంతపురం జిల్లాలో….
అనంతపురం రూరల్‌ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీ మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం విద్యార్థులకు పొంగలి, సాంబారు వడ్డించారు. తినినవెంటనే 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో, కొంతమంది పిల్లలు సొమ్మసిల్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన పాఠశాల వద్దకు వచ్చి 108 వాహనాల ద్వారా చికిత్సకోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్‌ ఆస్పత్రికి చేరుకొని వైద్య సేవలు అందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఇతర అధికారులు సైతం ఆస్పత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్న భోజనం పంపిణీలో వైఫల్యానికి బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స కోసం పిల్లలు చేరిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో పరుగు పెడుతూ ఆస్పత్రికి వచ్చారు. కన్నీరుమున్నీరుగా కొందరు విలపించారు. భోజన ఏజెన్సీ నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement