Friday, May 17, 2024

ఏపీలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌.. గత ఏడాదికంటే 35 శాతం అధికం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. శనివారం ఊహించని విధంగా 190.145 మిలియన్‌ యూనిట్లకు చేరింది. గత ఏడాది ఇదే రోజున 140.818 మిలియన్‌ యూనిట్లు మాత్రమే డిమాండ్‌ ఉంది. దీనినిబట్టి చూస్తే గత ఏడాదికంటే ఈఏడాది ఇదే రోజున 35.03 శాతం మేర అధికంగా డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. శనివారం పీక్‌ డిమాండ్‌ 8782 మెగావాట్లగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 6790 మెగావాట్లుగా నమోదవ్వగా గత ఏడాదికంటే ఇది 29.34 శాతం అధికంగా నమోదైంది. ఇక సగటు పీక్‌ డిమాండ్‌ 7923 మెగావాట్లుగా నమోదైంది. డిమాండ్‌ పెరిగినప్పటికీ గృహ, వ్యవసాయ విద్యుత్‌లో ఎటువంటి కోత విధించలేదని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పస్టంచేశారు. నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ) నివేదికల ప్రకారం అత్యధికంగా లోడ్‌ రిలీఫ్‌ తీసుకునే ఐదు రాష్ట్రాల్లో విద్యుత్‌ డిమాండ్‌ ఈ విధంగా ఉంది. వీటిలో ఏపీ, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు శనివారం ఎటువంటి షార్ట్‌ఫాల్‌ లేకుండా విద్యుత్‌ డిమాండ్‌ను చేరుకున్నాయి. అయితే, ఈ ఐడు రాష్ట్రాల్లో రాజస్థాన్‌ అత్యధికంగా 243.5 ఎంయూ విద్యుత్‌ డిమాండ్‌ చేరుకుని మొదటి స్థానంలో నిలచింది. ఇక రెండో స్థానంలో 190.145 ఎంయూ డిమాండ్‌తో ఏపీ ఉంది. మూడో స్థానంలో 122.9 ఎంయూ డిమాండ్‌తో బీహార్‌, నాలుగో స్థానంలో 44.9 ఎంయూ డిమాండ్‌తో ఉత్తరాఖండ్‌, ఐదో స్థానంలో ఝార్ఝండ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

190 ఎంయూ డిమాండ్‌ భర్తీ ఇలా :
ఏపీ జెన్‌కోలో థర్మల్‌ విద్యుత్‌ 50.362 ఎంయూ, జెన్‌కో హైడల్‌ నుండి 15.014 ఎంయూ, సీజీఎస్‌ నుండి 42.969 ఎంయూ, ఐపీపీలు (సెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, గ్యాస్‌)ల నుండి 17.749 ఎంయూ, పవన విద్యుత్‌ నుండి 30.899 ఎంయూ, సౌర విద్యుత్‌ నుండి 11.035 ఎంయూ, బహిరంగ మార్కెట్‌ల నుండి 21.079 ఎంయూ, ఇతరత్రా నుండి 1.038 ఎంయూ వంతున మొత్తం 190.145 ఎంయూ విద్యుత్‌ డిమాండ్‌ను చేరుకున్నారు.

రూ. 14.074 కోట్లతో కొనుగోలు :
శనివారం ఏర్పడిన డిమాండ్‌ను తీర్చేందుకు బహిరంగ మార్కెట్‌ల నుండి రూ. 14.074 కోట్లు వెచ్చించి 21.810 ఎంయూ విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేశాయి. అందులో డీఏఎం నుండి యూనిట్‌ రూ. 6.716 వంతున కొనుగోలుచేసి 19.083 ఎంయూ విద్యుత్‌ను రూ.12.815 కోట్లతో కొనుగోలు చేశారు. అలాగే ఆర్టీఎం నుండి యూనిట్‌ రూ. 4.614 వంతున 2.727 ఎంయూను రూ.1.258 కోట్లతో కొనుగోలుచేశారు. మొత్తంగా 21.810 ఎంయూ విద్యుత్‌ను సగటున రూ. 6.453 వంతున యూనిట్‌కు వెచ్చింని రూ. 14.074 కోట్లతో కొనుగోలు చేశారు.

బొగ్గు నిల్వలు ఇలా :
వీటీపీఎస్‌లో ప్రారంభ బొగ్గు నిల్వ 64,053 మెట్రిక్‌ టన్నులు ఉండగా 22,130 మెట్రిక్‌ టన్నులు శనివారం దిగుమతి అయింది. ఇందులో 17726 మెట్రిక్‌ టన్నుల మేర వి నియోగించగా, 68457 మెట్రిక్‌ టన్నుల మేర నిల్వ ఉంది. వీటీపీఎస్‌లో 2.4 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక ఆర్టీపీపీలో ప్రారంభ నిల్వ 22825 మెట్రిక్‌ టన్నులు ఉండగా 17642 మెట్రిక్‌ టన్నులు శనివారం దిగుమతి అయింది. ఇందులో 21171 మెట్రిక్‌ టన్నుల మేర వి నియోగించగా 19296 మెట్రిక్‌ టన్నుల మేర నిల్వ ఉంది. ఆర్టీపీపీలో 0.92 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. కృష్ణపట్టణంలో ప్రారంభ నిల్వ 320694 మెట్రిక్‌ టన్నులు ఉండగా, 10542 మెట్రిక్‌ టన్నులు శనివారం దిగుమతి అయింది. ఇందులో 6107 మెట్రిక్‌ టన్నుల మేర వి నియోగించగా, 325129 మెట్రిక్‌ టన్నుల మేర నిల్వ ఉంది. కృష్ణపట్టణంలో 17.11 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. హిందుజలో ప్రారంభ నిల్వ 14909 మెట్రిక్‌ టన్నులు ఉండగా 12819 మెట్రిక్‌ టన్నులు శనివారం దిగుమతి అయింది. ఇందులో 7298 మెట్రిక్‌ టన్నుల మేర వి నియోగించగా 20430 మెట్రిక్‌ టన్నుల మేర నిల్వ ఉంది. హిందుజలో 2.13 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement