Monday, April 29, 2024

Idupulapaya – వైఎస్ ష‌ర్మిలతో వివేక కుమార్తె సునీత భేటి…

కడప: : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో నేటి ఉద‌యం భేటీ అయ్యారు. అలాగే వైఎస్ ఆర్ ఘాట్ ను ష‌ర్మిల‌తో క‌ల‌సి ద‌ర్శించుకున్నారు సునీత‌.. ఇక సునీత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగినట్లు సమాచారం. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్ద తండ్రికి ష‌ర్మిల నివాళి..

కడప జిల్లా ఇడుపుల పాయ ఎస్టేట్ లో వైయస్సార్ ఘాట్ వద్ద తండ్రికి షర్మిలా రెడ్డి నివాళులర్పించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి ఇడుపులపాయ చేరుకున్న ఆమె అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం షర్మిలా రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆమెతోపాటు మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైయస్ సునీత రెడ్డి కూడా ఉన్నారు

అలాగే ఇడుపులపాయ ఎస్టేట్‌కు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో భేటీ అయ్యారు. కాగా నేడు ష‌ర్మిల కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డి ఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్ల‌నున్నారు.. క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల‌పై ఆయ‌న‌తో నేడు విస్త్రుతంగా చ‌ర్చించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement