Sunday, April 28, 2024

GVLN – 12 నుంచి విశాఖ‌లో సంక్రాంతి సంబ‌రాలు… హాజ‌రుకానున్న ప్ర‌ముఖులు

పెదవాల్తేరు – ఈ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం తీసుకువచ్చి వెలుగులు నింపాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆకాంక్షించారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించే శుభ తరుణంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకు అత్యంత ఆనందం తెస్తుందన్నారు. రైతు తాను చెమటోడ్చి పండించిన పంటలు చేతికి వచ్చి రైతు సుభిక్షంగా వుంటే దేశం సుభిక్షంగా వుంటుందన్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతియ ప్రముఖులు హాజరవుతా రన్నారు. దీన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్న వివిధ జాతుల, తెగల ఆచార వ్యవహారాలు,సాంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన ఈ సంబరాల్లో గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా రంగు రంగుల రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, తప్పెటగుళ్ళు తదితర సాంస్కృతిక అంశాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కళారూపాలతో నిర్మించనున్న సంక్రాంతి గ్రామం నమూనాలను ప్రదర్శిస్తా మన్నారు. ఈ సంబరాల వేదిక వద్ద సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టాళ్లు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చే వారు కమిటీని సంప్రదించా లన్నారు. ఈ సంబరాల్లో పాల్గొనే డ్వాక్రా సంఘాలు వారికి బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే పలు బ్యాంకు అధికారులతో మాట్లాడా మన్నారు. పలువురు ఎంపిలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు ఈ సంక్రాంతి వేడ‌క‌ల‌కు హాజరవుతా రన్నారు.

ఈ మీడియా సమావేశంలో సంక్రాంతి సంబరాల కమిటీ కన్వీనర్ చెరువు రామకోటయ్య, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు. విశాఖజిల్లా బిజెపి అధ్యక్షుడు మెడపాటి రవీంద్రనాద్, ఎంపి భార్య మైథిలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement