Sunday, April 28, 2024

శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు

పొన్నూరు ఫిబ్రవరి 18 ప్రభ న్యూస్ పట్టణంలో బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయం భవనాలు శిథిలమై నేల కూలటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని కార్యాలయాల ఉద్యోగులు సిబ్బంది తమ ప్రాణాలను సైతం అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు సంబంధిత అధికారులు అంచనాలు తయారుచేసి నిధులు మంజూరు చేయాలని గతంలో నివేదికలు పంపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు శిథిలావస్థకు చేరుకున్న భవనాలు స్థానంలో సరికొత్త డిజైన్లతో భవనాల నిర్మాణం చేపట్టడానికి నిధులు ప్రభుత్వం కేటాయించిందని ప్రకటన చేశారు. ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవటంతో స్థానికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టి పట్టణానికి నూతన శోభ తేవాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
వర్షాకాలంలో ప్రభుత్వ కార్యాలయాల పైకప్పు పూర్తిగా దెబ్బతిని వర్షం కురుస్తుంది. దీంతో కార్యాలయంలోని విలువైన రికార్డులు తడిసి పాడవుతున్నాయి. బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మించిన తహసిల్దార్ కార్యాలయం చాంబర్, మినిస్ట్రీస్ స్టాప్ రూమ్ లో పడుతున్న వర్షానికి సిబ్బంది పలు ఇక్కట్లు పడుతున్నారు. పై కప్పు పెంకులు దెబ్బ తినడంతో ఎప్పటికప్పుడు తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తున్న ప్రయోజనం లేదు. వర్షానికి సబ్ రిజిస్ట్ ట్రెజరీ కార్యాలయం స్లాబ్ పెచ్చులు ఊడిపోతూ ఇనుప చువ్వలు తుప్పుపట్టి స్లాబు అచ్చులు ఊడి సిబ్బందిపై పడుతున్నాయి. దీంతో ఆ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఎంపీడీవో కార్యాలయం స్టాక్ రూమును ఖాళీ చేసి సబ్ ట్రెజరీ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం పైకప్పు పూర్తిగా ప్లాస్టిక్ పట్టాలు కప్పి కాలం వెళ్లబుచ్చుతున్నారు. రికార్డు రూముల్లోని విలువైన ఫైల్ తడిసిపోతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న అర్బన్ పోలీస్ స్టేషన్, సబ్ జైల్ కార్యాలయాలు ముళ్ళ చెట్లతో అడవిని తలపిస్తున్నాయి. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో వెనుక భాగాన గత ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న పొన్నూరు ఏ డి ఏ కార్యాలయం, ఎస్ టి ఓ కార్యాలయం భవనాలు నిర్మాణం మధ్యలోఆగిపోయాయి. మూడేళ్లు గడుస్తున్న భవనాల నిర్మాణం అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటివరకు భవనాల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకోలేదు. పట్టణం, మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల భవనాలు కూడా పూర్తిగా మరమ్మత్తులు చేరుకుని శిధిలావస్థకు చేరాయి. దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటివరకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం పనులు, మరమ్మత్తులు చేపట్టాలని ఆలోచన చేయకపోవడంపై స్థానిక ప్రజలు. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement