Friday, May 17, 2024

గోదావరి బోర్డు భేటీ మళ్లీ వాయిదా.. ఏపీ గైర్హాజరుతో సమావేశం వాయిదా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం మరోమారు వాయిదా పడింది. మార్చి 11వ తేదీన వాయిదా పడిన జీఆర్‌ఎంబీ 13వ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఇక్కడి జలసౌధ వేదికగా సమావేశం జరగాల్సి ఉంది. నిర్ణీత సమయానికి జీఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ సహ ఇతర సభ్యులు తెలంగాణ నీటి పారుదలశాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన జల వనరులశాఖ అధికారులు, ఇంజనీర్లెవరూ ఈ సమావేశానికి రాకపోవడంతో చైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఈ భేటీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తమకు ఇతర పనులు ఉన్నందున శుక్రవారం నాటి సమావేశాన్ని వాయిదా వేయాలని గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు జీఆర్‌ఎంబీ చైర్మన్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఏపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో తాను కూడా ఈ భేటీకి రానని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సమాచారం ఇచ్చారు. సరిపడా కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. గత నెల వాయిదా పడిన జీఆర్‌ఎంబీ సమావేశం 42 రోజుల తర్వాత శుక్రవారం నిర్వహిస్తున్నా ఏపీ అధికారులు ఈ భేటీకి రాకపోవడం సబబు కాదని తెలంగాణ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మళ్లిd బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన జీఎంఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ను కోరారు. తెలంగాణకు చెందిన మూడు ప్రాజెక్టులు చనాకా – కొరాట, చౌటుపల్లి, హనుమంతురెడ్డి, చిన్న కాళేశ్వరం డీపీఆర్‌లను ఆమోదం తెలపడంతో పాటు బోర్డు బడ్జెట్‌ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా జీఆర్‌ఎంబీ సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది వీలైనంత త్వరలో తేదీని ఖరారు చేసి ప్రకటిస్తామని చైర్మన్‌ ఎంపీ సింగ్‌ చెప్పారు.

ఉద్దేశపూర్వకంగానే ఏపీ అధికారులు గైర్హాజరు : రజత్‌
శుక్రవారం ఏర్పాటు చేసిన జీఆర్‌ఎంబీ బోర్డు సమావేశానికి ఏపీ జల వనరులశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారని రాష్ట్ర నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన మూడు డీపీఆర్‌లకు జీఆర్‌ఎంబీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఏపీ సభ్యులు రాకపోవడంతో ఈ ప్రాజెక్టుల ఆమోదం, అనుమతులకు ఆలస్యమవుతోందని ఆయన చెప్పారు. గత సమావేశానికి కూడా ఏపీ సభ్యులు రాలేదని గుర్తు చేశారు. సీతారామ, తుపాకులగూడెంకు చెందిన హైడ్రాలాజికల్‌ అనుమతి వచ్చిందని రజత్‌ కుమార్‌ చెప్పారు. అన్ని ప్రాజెక్టులకు జులైలోగా అనుమతులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై కేంద్రం ఇంకా ట్రిబ్యునల్‌కు నివేదించలేదని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement