Friday, May 17, 2024

ఆడపిల్లలకు రక్షణ లేదు.. సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేదా: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది ఆసుపత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా, సెక్యూరిటీ- ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం అవుతోందన్నారు. తమ బిడ్డ కనిపించడం లేదని కన్నవారు నున్న పోలీసులను ఆశ్రయించి ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినా బాధ్యత కలిగిన అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని శుక్రవారం అన్నారు. పోలీసులు సత్వరమే స్పందించి ఉంటే మానసిక పరిపక్వత లేని యువతికి 30 గంటల నిర్బంధం, ఆమెపై ఘోర అఘాయిత్యం జరిగేవా అని ప్రశ్నించారు.

నిందితులను శిక్షించాలని గొంతెత్తిన జనసేన నాయకులూ, ఇతర పార్టీలవారిపై కేసులు నమోదు చేయడంలో చూపిన చురుకుదనం ఒక ఆడబిడ్డ ఆచూకీ తీయడంలో చూపించాల్సిందని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేసినా ఇప్పటికీ ఆ చట్టం అమలులోకి రాలేదని, ఆ చట్టం ద్వారా నిందితులను శిక్షించే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులే ఆడ బిడ్డల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఎంతో ఆందోళన, ఆవేదనతో పోలీసులను ఆశ్రయించే తల్లితండ్రులకు భరోసా ఇచ్చేలా సత్వర స్పందన అవసరమని పవన్‌ పేర్కొన్నారు.

అఘాయిత్యాలు ఏటేటా పెరుగుతున్నాయి..
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఏటేటా పెరుగుతున్న వాస్తవం విస్మరించలేనిదని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 2020తో పోల్చుకొంటే 2021లో ఈ కేసులు 25 శాతం పెరిగాయని గత డీజీపీ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇకనైనా పాలక పక్షం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలు, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజలకు రక్షణ నిమిత్తం వినియోగించాలని సూచించారు. విజయవాడ జీజీహెచ్‌లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు- ఆ కుటు-ంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement