Monday, May 6, 2024

Tenali: గంజాయి బ్యాచ్ వీరంగం… నలుగురికి తీవ్రగాయాలు

గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించడంతో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు ఓ అపార్ట్ మెంట్ వద్ద పనిచేస్తున్న కూలీలతో అనవసరంగా గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో పదిమంది గంజాయి గ్యాంగ్ కూలీలతో పాటు మరో ఇద్దరిపై రాడ్లు, కర్రలు, బ్యాట్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నందులపేట కవిరాజ పార్క్ వద్ద గల ఓ అపార్ట్ మెంట్ లో ఇద్దరు కూలీలు పనిచేస్తుండగా ముగ్గురు యువకులు అటువైపు వచ్చారు. గంజాయి మత్తులో వున్న యువకులు ఆటో లోంచి సిమెంట్ బస్తాలు దింపుతున్న కూలీలలో గొడవ పెట్టుకున్నారు.

ఆటోపై దాడి చేయడంతో పాటు కూలీలను కొట్టడానికి ప్రయత్నించగా అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, వాచ్ మెన్ అడ్డుకున్నారు. దీంతో అక్కడినుండి వెళ్లిపోయిన యువకులు మరికొందరితో తిరిగివచ్చి కూలీలతో పాటు అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, వాచ్ మెన్ పై దాడికి దిగారు. 10 మంది గంజాయి బ్యాచ్ కర్రలు, బ్యాట్లు, రాడ్లు, రాళ్లతో అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని మొదట కూలీలపై దాడిచేసారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, వాచ్ మెన్ పై కూడా దాడికి దిగారు. భయంతో పారిపోతున్నా విడిచిపెట్టకుండా వెంటపడి మరీ నలుగురిని చితకబాదారు. ఇలా గంజాయి బ్యాచ్ దాడిలో ఇద్దరికి తలలు పగిలి తీవ్ర గాయాలవగా మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు తెనాలి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే వుంది. అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గంజాయి బ్యాచ్ ను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement